
DNews : Dec 01: హైదరాబాద్లో ఈరోజు (సోమవారం) బీజేపీ నాయకులు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మను కలిశారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన హిల్ట్ పాలసీపై వారు గవర్నర్కు ఫిర్యాదు చేశారు. అనంతరం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మీడియాతో మాట్లాడుతూ, హిల్ట్ పాలసీ పేరుతో పరిశ్రమల కోసం కేటాయించిన భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారులకు మళ్లిస్తున్నారని ఆరోపించారు. వేల కోట్ల రూపాయల అవకతవకలు జరుగుతున్నాయని, మార్కెట్ విలువ కంటే తక్కువ ధరలకు భూములను విక్రయిస్తున్నారని విమర్శించారు. 9,292 వేల ఎకరాల భూమి విలువ రూ.6 లక్షల 30 వేల కోట్లుగా ఉండగా, కేవలం రూ.5 వేల కోట్లకే రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అప్పగిస్తున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుందా..? లేక పరిపాలన చేస్తుందా..? అని ఆయన నిలదీశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమై, పరిశ్రమల భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కట్టబెట్టడం ద్వారా లాభపడుతోందని వ్యాఖ్యానించారు. ఈ నెల 7న ఇంద్రపార్క్లో హిల్ట్ పాలసీకి వ్యతిరేకంగా మహాధర్నా నిర్వహించనున్నట్లు ప్రకటించారు. గవర్నర్ ఈ విషయాన్ని ప్రభుత్వంతో చర్చిస్తానని హామీ ఇచ్చారని రామచంద్రరావు వెల్లడించారు. బీజేపీ నేత ఎలేటి మహేశ్వర్ రెడ్డి కూడా గవర్నర్కు ఫిర్యాదు చేసినట్లు, 7వ తేదీన ప్రభుత్వ వైఫల్యంపై నిరసన చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో రామచంద్రరావుతో పాటు మహేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ అంజి రెడ్డి, జనరల్ సెక్రటరీ వీరేందర్ గౌడ్, జిహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్ మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు.
