
D News: Jul 20: తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని లబ్ధిదారులకు త్వరలో కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేయనుంది. మరో వారం రోజుల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. హైదరాబాద్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనుండగా, మిగిలిన 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో స్థానిక ఎమ్మెల్యేలు కార్డులను పంపిణీ చేయనున్నారు.
ప్రస్తుతం వినియోగంలో ఉన్న కాగితపు రేషన్ కార్డుల స్థానంలో పీవీసీ స్మార్ట్ కార్డులను అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. నాణ్యమైన పీవీసీతో రూపొందించే ఈ కార్డులు ఎక్కువకాలం మన్నికగా ఉండటంతో పాటు చినిగిపోవడం లేదా పాడైపోవడం వంటి సమస్యలు ఉండవు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొలిసారిగా కాగితపు కార్డుల స్థానంలో ఈ ఆధునిక స్మార్ట్ కార్డులు అందుబాటులోకి రానున్నాయి.
కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల్లో ఆధునిక సాంకేతికతను వినియోగించారు. ప్రతి కార్డుపై క్యూఆర్ కోడ్, రేషన్ కార్డు నంబర్, కుటుంబ పెద్ద వివరాలు ముద్రించబడతాయి. అలాగే ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మరోవైపు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫొటోలు ఉంటాయి. క్యూఆర్ కోడ్ ద్వారా లబ్ధిదారుల వివరాలను సులభంగా ధృవీకరించడంతో పాటు పారదర్శకంగా రేషన్ పంపిణీ చేయడం సాధ్యమవుతుంది.
ప్రస్తుతం లబ్ధిదారులు ఏ4 సైజు కాగితంపై ముద్రించిన రేషన్ కార్డులను ఉపయోగిస్తున్నారు. అవి త్వరగా చిరిగిపోవడం, దెబ్బతినడం వంటి సమస్యలు ఎదురవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం పీవీసీ స్మార్ట్ కార్డులను తీసుకురావాలని నిర్ణయించింది. దీంతో కార్డులు సురక్షితంగా, మన్నికగా ఉండటంతో పాటు వినియోగం కూడా సులభతరం కానుంది.
ఇదిలా ఉండగా, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు సంబంధించిన రేషన్ను ఒకేసారి పంపిణీ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. వర్షాకాల పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఆగస్టు 1 నుంచి ఈ పంపిణీ ప్రారంభం కానుండగా, ఈ-కేవైసీ పూర్తి చేసిన రేషన్ కార్డు లబ్ధిదారులు రేషన్ను పొందవచ్చు.
