
D Spiritual: Sept 4: తిరుమల శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈఓగా భాస్కర్ నియామకం
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలనా విభాగంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. తిరుమల శ్రీవారి ఆలయ కొత్త డిప్యూటీ ఈఓగా భాస్కర్ను నియమిస్తూ టీటీడీ మంగళవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆయన తిరుమల రిసెప్షన్-1 డిప్యూటీ ఈఓగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈఓగా పనిచేస్తున్న లోకనాథంపై ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలతో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు దాడులు నిర్వహించి అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో ఆయన స్థానంలో కొత్త అధికారిని నియమిస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది.
లోకనాథంకు 14 రోజుల రిమాండ్
ఏసీబీ అధికారులు అరెస్టు చేసిన అనంతరం లోకనాథంను కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసును విచారించిన న్యాయస్థానం ఆయనకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.
ఆలయ వ్యవహారాలకు అంతరాయం లేకుండా..
శ్రీవారి ఆలయంలో నిత్య కైంకర్యాలు, భక్తులకు అందించే సేవలు, ఆలయ పాలనా వ్యవహారాలకు ఎలాంటి అంతరాయం కలగకుండా టీటీడీ ఈఓ వెంటనే చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా అనుభవజ్ఞుడైన భాస్కర్ను శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈఓగా నియమించినట్లు టీటీడీ వర్గాలు తెలిపాయి.
ప్రస్తుతం తిరుమల రిసెప్షన్-1 డిప్యూటీ ఈఓగా పనిచేస్తున్న భాస్కర్కు ఆలయ పాలనా వ్యవహారాలపై ఉన్న అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. ఉన్నతాధికారి ఏసీబీకి చిక్కిన వెంటనే నూతన అధికారిని నియమించడంతో ఈ పరిణామం తిరుమల వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.
