
D Educt: Aug 5: సంగారెడ్డి జిల్లా చౌట్కూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (జెడ్పీహెచ్ఎస్)లో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం (పీజేటీఎస్ఏయూ) రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల విద్యార్థుల ఆధ్వర్యంలో ‘పరిశుభ్రత – ఆరోగ్యకరమైన అలవాట్లు’ అనే అంశంపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పీఆర్టీయూ (PRTU) మండల అధ్యక్షుడు మోహన్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా మోహన్రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు చిన్నతనం నుంచే వ్యక్తిగత పరిశుభ్రతను పాటించడంతో పాటు తమ పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. పాఠశాల స్థాయి నుంచే వ్యవసాయ రంగం, దాని ప్రాధాన్యతపై అవగాహన పెంపొందించుకోవాలని తెలిపారు. పదో తరగతి వార్షిక పరీక్షల్లో అత్యుత్తమ మార్కులు సాధించి వ్యవసాయ విద్యపై ఆసక్తి ఉన్న విద్యార్థులు అగ్రికల్చర్ యూనివర్సిటీలో చేరి ఉన్నత విద్యను అభ్యసించి దేశాభివృద్ధికి సేవ చేయాలని కోరారు.
అవగాహన కార్యక్రమంలో వ్యవసాయ కళాశాల విద్యార్థులు రితిక, శ్రీనిధి, రాణి, దివ్యశ్రీలు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ప్రతిరోజూ ఉదయాన్నే త్వరగా నిద్రలేచి పరిశుభ్రంగా ఉండటంతో పాటు ఉదయం వేళల్లో చదువుకునే అలవాటు పెంపొందించుకోవాలని సూచించారు. సమయాన్ని వృథా చేసే టెలివిజన్, మొబైల్ ఫోన్ల వినియోగాన్ని తగ్గించి చదువుపై పూర్తి దృష్టి సారించాలని తెలిపారు. పాఠశాల ఆవరణలో చెత్తాచెదారం వేయకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచితే అనేక వ్యాధుల బారిన పడకుండా ఉండవచ్చని వివరించారు.
పరిశుభ్రత, క్రమశిక్షణ, మంచి అలవాట్లను అలవరచుకుంటే విద్యార్థులు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండటంతో పాటు విద్యలోనూ మంచి ఫలితాలు సాధించగలరని వక్తలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఇన్చార్జి ఉపాధ్యాయురాలు విజయలక్ష్మి, ఉపాధ్యాయులు రమాదేవి, లలితదేవి, కవిత, భాస్కర్రాజు, సూర్యారావు, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
