
D Spiritual: Sept 5: శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి శిలాశాసనం వెలుగులోకి.. 500 ఏళ్ల చరిత్రకు సాక్ష్యం
విజయనగర సామ్రాజ్య వైభవాన్ని, శ్రీకృష్ణదేవరాయల పాలనా దక్షతను చాటిచెప్పే మరో అపురూపమైన శిలాశాసనం తాజాగా వెలుగులోకి వచ్చింది. నాటి భక్తి ప్రపత్తులు, ఆలయ నిర్వహణ, పాలనా వ్యవస్థకు సంబంధించిన కీలక వివరాలను ఈ శాసనం తెలియజేస్తోంది.
ప్రకాశం జిల్లాలో శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి ఈ చారిత్రక శిలాశాసనాన్ని గుర్తించారు. కొనకనమిట్ల మండలం గార్లదిన్నె గ్రామంలోని వెలిగొండ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఈ శాసనం వెలుగుచూసింది. ఇది 15వ శతాబ్దానికి చెందినదిగా చరిత్ర పరిశోధకులు గుర్తించారు.
ఈ శాసనం ప్రకారం.. క్రీ.శ. 1521లో ఆలయ నిర్వహణ, ఉత్సవాలు, నిత్య కైంకర్యాలకు అవసరమైన నిధుల కోసం ఉదయగిరి రాజ్యంలోని పొదిలి సీమకు చెందిన గార్లదిన్నె, కట్టిరాళ్లగుంప అనే రెండు గ్రామాలను దానంగా ఇచ్చినట్లు తెలుస్తోంది.
శ్రీకృష్ణదేవరాయల కాలానికి చెందిన శిలాశాసనాలు ఇటీవలి కాలంలో తెలుగు, కన్నడ, సంస్కృత భాషల్లో పెద్ద సంఖ్యలో వెలుగులోకి వస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకలోని పలు వైష్ణవ ఆలయాల్లోనూ ఇలాంటి శాసనాలు గుర్తిస్తున్నారు.
ఈ శిలాశాసనాల ద్వారా విజయనగర సామ్రాజ్య విస్తరణ, రాజుల యుద్ధ విజయాలతో పాటు దేవాలయాల నిర్వహణ కోసం అప్పట్లో ఇచ్చిన భూములు, గ్రామాలు, పట్టణాలకు సంబంధించిన అనేక చారిత్రక వివరాలు తెలుస్తున్నాయి. దీంతో నాటి పాలనా విధానం, ఆర్థిక వ్యవస్థ, ఆలయాలకు రాజులిచ్చిన ప్రాధాన్యంపై మరింత సమాచారం లభిస్తోంది.
చరిత్రలో శ్రీకృష్ణదేవరాయలకు విశిష్ట స్థానం
భారతదేశాన్ని పాలించిన గొప్ప చక్రవర్తుల్లో శ్రీకృష్ణదేవరాయలకు ప్రత్యేక స్థానం ఉంది. ఆయన తన 20వ ఏట క్రీ.శ. 1509 ఫిబ్రవరి 4న విజయనగర సింహాసనాన్ని అధిష్ఠించారు. ఆయన పాలనలో విజయనగర సామ్రాజ్యం అత్యున్నత స్థాయికి చేరుకుంది.
క్రీ.శ. 1529 అక్టోబరు 17 వరకు కొనసాగిన ఆయన పాలనలో రాజ్య విస్తరణ కోసం చేసిన యుద్ధ విజయాలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాయి. తెలుగు, కన్నడ ప్రజల ఆదరణ పొందిన శ్రీకృష్ణదేవరాయలు పరిపాలనతో పాటు దేవాలయాల అభివృద్ధికి కూడా విశేష ప్రాధాన్యం ఇచ్చారు.
ఈ నేపథ్యంలో ఆయన కాలంలో వేయించిన శిలాశాసనాలు ప్రస్తుతం పలు ప్రాంతాల్లో వెలుగులోకి రావడం చరిత్ర పరిశోధకులకు ఎంతో ప్రాధాన్యంగా మారింది. తాజాగా గార్లదిన్నెలో బయటపడిన శిలాశాసనం కూడా విజయనగర సామ్రాజ్య చరిత్రకు మరో విలువైన ఆధారంగా నిలిచింది.
