
DNews: JUly04: వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో రేపు (శనివారం) పలు జిల్లాల్లో భారీ నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.
అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా, రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో పిడుగులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశముందని వెల్లడించారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, పల్నాడు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములు, పిడుగులు సంభవించే అవకాశముందని పేర్కొన్నారు. ఇతర జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
తీర ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. చెట్లు, విద్యుత్ స్తంభాలు, పాత భవనాలు, హోర్డింగుల సమీపంలో నిలబడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. అలాగే మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని స్పష్టం చేశారు.
జులై 8 వరకు ఎల్లో అలర్ట్
ఇక భారత వాతావరణ శాఖ (IMD) తెలుగు రాష్ట్రాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాలతో పాటు తెలంగాణలోనూ జులై 8వ తేదీ వరకు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రజలు వాతావరణ హెచ్చరికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ అవసరమైన జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు.
