
D Spiritual: Jan 24: రథసప్తమి సందర్భంగా తిరుమల–తిరుపతిలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టీటీడీ భారీ ఏర్పాట్లు చేపట్టింది. జనవరి 25న నిర్వహించనున్న రథసప్తమి వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని టీటీడీ చైర్మన్ బీ.ఆర్. నాయుడు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాట్లకు సంబంధించిన కీలక వివరాలను ఆయన వెల్లడించారు.
భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సామాన్య భక్తులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు టీటీడీ స్పష్టం చేసింది. ఎక్కువ మంది భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించాలనే ఉద్దేశంతో జనవరి 24 నుంచి 26వ తేదీ వరకు తిరుపతిలో స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్ల జారీని రద్దు చేసినట్లు వెల్లడించింది.
రథసప్తమి రోజున శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు, ప్రివిలేజ్ దర్శనాలు, ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. ఈ చర్యలతో సామాన్య భక్తులకు దర్శన అవకాశం పెరుగుతుందని పేర్కొంది.
భక్తులకు అన్నప్రసాదాల పంపిణీ కోసం ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేసినట్లు టీటీడీ తెలిపింది. రథసప్తమి రోజున భక్తులకు పంపిణీ చేసేందుకు 14 రకాల మెనూను సిద్ధం చేశారు. గ్యాలరీల్లో ఉన్న భక్తులందరికీ 85 ఫుడ్ కౌంటర్ల ద్వారా ఉదయం నుంచి రాత్రి వరకు నిరంతరంగా అన్నప్రసాదాలు అందేలా ఏర్పాట్లు చేశారు.
అలాగే మాడ వీధులు, వివిధ విభాగాల్లో భక్తులకు అన్నప్రసాదాలు, పానీయాలు పంపిణీ చేయడానికి సుమారు 3,700 మంది శ్రీమతి సేవకుల సేవలను వినియోగిస్తున్నట్లు తెలిపారు. భక్తుల భద్రత కోసం 1,300 మంది పోలీసులు, 1,200 మంది విజిలెన్స్ సిబ్బందితో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.
పబ్లిక్ అడ్రెస్ సిస్టమ్ ద్వారా భక్తులకు అవసరమైన సమాచారాన్ని వివిధ భాషల్లో అందజేసేలా చర్యలు తీసుకున్నట్లు టీటీడీ పేర్కొంది. భక్తుల రవాణా సౌకర్యాల కోసం గత సంవత్సరం 1,900 ట్రిప్పులు నడిపిన ఏపీఎస్ఆర్టీసీ, ఈ ఏడాది భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని 2,300 ట్రిప్పులు నడిపేందుకు సిద్ధమైంది.
శ్రీవారి వాహన సేవల ఎదుట భక్తులను ఆకట్టుకునేలా ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. వాహన సేవల ముందు 56 రకాల కళా రూపాలను వెయ్యి మంది కళాకారులతో ప్రదర్శించనున్నారు.
గ్యాలరీల్లో ఏర్పడే వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించేలా ప్రత్యేక దృష్టి సారించినట్లు టీటీడీ తెలిపింది. ఇందుకోసం అదనపు సిబ్బందిని నియమించారు. అలాగే భక్తులకు అత్యవసర వైద్య సేవలు అందించేందుకు అవసరమైన వైద్య సిబ్బంది, మందులు, అంబులెన్సు వాహనాలను సిద్ధం చేశారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తుల కోసం టీటీడీ ఎస్వీబీసీ ఛానెల్ ద్వారా రథసప్తమి వాహన సేవలను ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
రథసప్తమి రోజున వాహన సేవల షెడ్యూల్ను కూడా టీటీడీ ప్రకటించింది. ఉదయం 5.30 నుంచి 8 గంటల వరకు సూర్యప్రభ వాహనం, ఉదయం 9 నుంచి 10 గంటల వరకు చిన్న శేష వాహనం, ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు గరుడ వాహనం నిర్వహించనున్నారు.
మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకు హనుమంత వాహనం, మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు చక్రస్నానం, సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు కల్పవృక్ష వాహనం, సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు సర్వభూపాల వాహనం, రాత్రి 8 నుంచి 9 గంటల వరకు చంద్రప్రభ వాహనం నిర్వహించనున్నట్లు తెలిపారు.
