
D Tech: Jul 7: E20 Petrol: దేశంలో కాలుష్యాన్ని తగ్గించడం, ఇంధన దిగుమతులను తగ్గించడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ (E20) వినియోగాన్ని ప్రోత్సహిస్తోంది. అయితే E20 పెట్రోల్ వాడకంపై పాత వాహనదారుల్లో కొన్ని సందేహాలు నెలకొన్నాయి. ముఖ్యంగా E10 ఇంధనానికి మాత్రమే అనుకూలంగా తయారైన వాహనాల్లో E20ను ఎక్కువకాలం ఉపయోగిస్తే ఇంజిన్, ఫ్యూయల్ సిస్టమ్లోని కొన్ని భాగాలు దెబ్బతినే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ARAI నిర్వహించిన అధ్యయనం ప్రకారం, కొన్ని BS-IV ఇంజిన్లు E20 ఇంధనంతో సంతృప్తికరంగా పనిచేయగా, ఒక BS-VI టర్బోచార్జ్డ్ ఇంజిన్లో 265 గంటల పరీక్ష తర్వాత సమస్యలు గుర్తించారు. మరో పరీక్షలో ఒక తయారీదారు వాహనంలో 400 గంటల వరకు ఎలాంటి సమస్యలు కనిపించకపోయినా, మరో కంపెనీ ఇంజిన్లో 809 గంటల తర్వాత ఎగ్జాస్ట్ వాల్వ్లో లోపం తలెత్తినట్లు గుర్తించారు.
పాత వాహనాల్లో వచ్చే సమస్యలు
E20లోని ఇథనాల్ రబ్బరు, కొన్ని ప్లాస్టిక్ భాగాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. దీంతో ఫ్యూయల్ పైపులు, రబ్బరు హోస్లు, సీల్స్ దెబ్బతినడం, ఇంధన లీకేజీలు ఏర్పడడం, అలాగే ఇంధన ట్యాంక్, మెటల్ పైపుల్లో తుప్పు పట్టే ప్రమాదం ఉందని నివేదికలు సూచిస్తున్నాయి.
కొత్త వాహనాలకు ఇబ్బంది లేదు
2023 ఏప్రిల్ తర్వాత విడుదలైన చాలా కొత్త కార్లు, బైకులు E20 Material Compliant ప్రమాణాలతో తయారయ్యాయి. వీటిలోని రబ్బరు, మెటల్ భాగాలు 20 శాతం ఇథనాల్ను తట్టుకునేలా రూపొందించినందున కొత్త వాహనదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు.
వాహనదారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
మీ వాహనం E10 లేదా E20 ఇంధనానికి అనుకూలమో యూజర్ మాన్యువల్ లేదా ఫ్యూయల్ క్యాప్పై ఉన్న వివరాలు చూసి నిర్ధారించుకోవాలి. పాత వాహనాలైతే సర్వీసింగ్ సమయంలో ఫ్యూయల్ పైపులు, రబ్బరు హోస్లను తప్పనిసరిగా తనిఖీ చేయించుకోవాలి. అవసరమైతే 100 ఆక్టేన్ వంటి ప్రీమియం పెట్రోల్ను ఉపయోగించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
మైలేజీపై ప్రభావం
నివేదికల ప్రకారం E10తో పోలిస్తే E20 పెట్రోల్ వాడినప్పుడు ఇంధన వినియోగం సుమారు 2 నుంచి 6 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది. దీంతో వాహనాల మైలేజీ స్వల్పంగా తగ్గవచ్చని ఆటోమొబైల్ నిపుణులు పేర్కొంటున్నారు.
