
D News: Aug 4: థాయిలాండ్లోని ఫుకెట్ నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఎయిర్ ఇండియా AI2379 విమానం గాల్లో ప్రయాణిస్తున్న సమయంలో తీవ్ర కుదుపులకు గురైంది. ఆకస్మికంగా ఏర్పడిన టర్బులెన్స్ కారణంగా విమానం ఎత్తులో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నట్లు ఎయిర్ ఇండియా అధికారికంగా వెల్లడించింది.
తీవ్ర కుదుపులు ఎదురైనప్పటికీ పైలట్ల సమయస్ఫూర్తితో విమానాన్ని ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ చేశారు. విమానంలో ఉన్న ప్రయాణికులు, సిబ్బంది అందరూ క్షేమంగా బయటపడగా, ఎవరికీ తీవ్ర గాయాలు కాలేదని అధికారులు తెలిపారు.
టర్బులెన్స్ ప్రభావంతో కొందరు ప్రయాణికులు, విమాన సిబ్బందికి స్వల్ప గాయాలయ్యాయి. విమానం ల్యాండ్ అయిన వెంటనే ముందుజాగ్రత్త చర్యగా వారిని విమానాశ్రయంలోని వైద్య కేంద్రానికి తరలించి అవసరమైన చికిత్స అందించారు. అనంతరం వారి ఆరోగ్య పరిస్థితిని వైద్య బృందం పరిశీలించింది.
ఈ ఘటనపై ఎయిర్ ఇండియా స్పందిస్తూ ప్రయాణికులు, సిబ్బంది భద్రతకే అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొంది. బాధితులకు అవసరమైన అన్ని సహాయక చర్యలు అందిస్తున్నామని, ఘటనపై విమానయాన అధికారులు నిర్వహిస్తున్న విచారణకు పూర్తిస్థాయిలో సహకరిస్తున్నట్లు సంస్థ అధికారిక ప్రతినిధి వెల్లడించారు.
