
DNews: Feb 24: హైదరాబాద్లోని కోఠి SBI ఏటీఎం వద్ద గత నెల జరిగిన కాల్పుల కేసును టాస్క్ ఫోర్స్ పోలీసులు ఛేదించారు. ఈ ఘటనలో పాల్గొన్న నిందితులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుండి తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. జనవరి 31న రిన్షాద్ అనే వ్యక్తి నగదు జమ చేయడానికి కోఠి SBI ఏటీఎంకు వచ్చినప్పుడు దుండగులు అతనిపై కాల్పులు జరిపి, రూ. 6 లక్షల నగదు మరియు అతని వాహనాన్ని దోచుకుని పారిపోయారు. రిన్షాద్ గాయపడగా, పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని అతన్ని ఆసుపత్రికి తరలించారు. బాధితుడి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన పోలీసులు, దోపిడీ అనంతరం నిందితులు కాచిగూడ DMart సమీపంలోని ప్రార్థనా మందిరానికి వెళ్లి దుస్తులు మార్చుకున్నారని గుర్తించారు. అనంతరం వారు వాహనాన్ని రైల్వే స్టేషన్ వద్ద వదిలి పారిపోయారు. వారు రైలులోనా, బస్సులోనా లేదా ఇతర వాహనంలోనా వెళ్లారో అనేది ఇంకా దర్యాప్తులో ఉంది. ఫిబ్రవరి 16న ఒక నిందితుడు హర్యానాలో అరెస్టయ్యాడు. అతని సమాచారం ఆధారంగా మరో నిందితుడి కోసం ఉత్తరప్రదేశ్, హర్యానా రాష్ట్రాల్లో టాస్క్ ఫోర్స్ పోలీసులు శోధన చేపట్టి చివరికి అతనిని కూడా అరెస్ట్ చేసి హైదరాబాద్కు తీసుకువచ్చారు. త్వరలోనే వారిని మీడియా ముందు హాజరుపరచనున్నట్లు తెలుస్తోంది.
