
DNews: Jan 28: సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలంలోని కార్డనూర్లో కొత్త సబ్-రిజిస్ట్రార్ కార్యాలయ భవన నిర్మాణానికి మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, వివేక్ వెంకట స్వామి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ, భూ సంబంధిత సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ధరణి వ్యవస్థను మార్చి భూ భారతి వ్యవస్థను ప్రవేశపెట్టామని, ఇది ప్రజలకు ఒకే ప్యాకేజీలో అందుబాటులో ఉందని చెప్పారు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ విభాగంలో కోట్ల రూపాయలు చెల్లించే ప్రజలకు ఇబ్బందులు లేకుండా సమగ్ర కార్యాలయాలను నిర్మిస్తున్నామని వివరించారు.
ఔటర్ రింగ్ రోడ్ (ORR) పరిధిలో 11 సమగ్ర కార్యాలయాలు నిర్మిస్తున్నామని, పటాన్చెరు ప్రాంతంలో సబ్-రిజిస్ట్రార్ కార్యాలయానికి 3 ఎకరాల భూమి కేటాయించామని తెలిపారు. ఈ నిర్మాణం ప్రభుత్వంపై అదనపు భారంలేకుండా CSR నిధుల ద్వారా చేపట్టబడిందని, నిర్మాణ పనులను రాజ్ పుష్ప సంస్థకు అప్పగించామని చెప్పారు. 25 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో అన్ని సౌకర్యాలతో ఈ భవనం వచ్చే ఆరు నెలల్లో సిద్ధం కానుందని వెల్లడించారు.
పెద్దపల్లి ప్రాంతంలో కూడా రాజ్ పుష్ప సంస్థ భవన నిర్మాణాన్ని చేపట్టిందని, ఈ భవనాల నిర్వహణను సంబంధిత సంస్థలకు ఐదు సంవత్సరాలపాటు అప్పగించామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 11 ఏజెన్సీలను ఎంపిక చేసి ఈ ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పారు. సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఫైవ్స్టార్ సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నామని, వివాహ హాళ్లు, అనాథలకు ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తున్నామని వివరించారు.
భవిష్యత్తులో భూదార్ వ్యవస్థను ప్రవేశపెట్టి ఎలాంటి వివాదాలు లేకుండా భూ సరిహద్దులు, వివరాలు ఒకే వేదికలో అందుబాటులో ఉంటాయని తెలిపారు. పరిమిత భూములపై అనేక వివాదాలు ఉన్నందున వాటిని పరిష్కరించేందుకు రెండు నెలల్లో కొత్త యాప్ను తీసుకువస్తున్నామని చెప్పారు. భూదార్ కార్డు అన్ని భూ సంబంధిత సమస్యలకు సంపూర్ణ పరిష్కారం అవుతుందని, భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు ఉండవని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అంజి రెడ్డి, కార్పొరేషన్ చైర్మన్లు నిర్మల జగ్గారెడ్డి, ఫహీమ్ పాల్గొన్నారు.
