
DNews: Jan 23: బాసర (ఆదిలాబాద్): విద్యాదేవి సరస్వతి అమ్మవారి జన్మదినోత్సవం సందర్భంగా బాసర ఆలయం ప్రత్యేకంగా అలంకరించబడింది. గురువారం సాయంత్రం నుంచే తెలుగు రాష్ట్రాలు, మహారాష్ట్ర నుండి వేలాది మంది భక్తులు వసంతపంచమి వేడుకలకు తరలివచ్చారు. శుక్రవారం ఉదయం నుంచే పిల్లలకు అక్షరాభ్యాసం చేయించేందుకు తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకున్నారు. భక్తుల సంఖ్య విపరీతంగా పెరగడంతో ఆలయ పరిసరాల్లోని అన్ని ప్రైవేట్ ఇన్నులు నిండిపోయాయి. గదులు దొరకకపోవడంతో కొంతమంది ఆలయ ప్రాంగణంలో, చెట్ల కింద నిద్రించగా, మరికొందరు జమాబాద్ వరకు వెళ్లి వసతి పొందారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సాధారణంగా ఉదయం 7 గంటలకు ప్రారంభమయ్యే అక్షరాభ్యాస పూజలు ఈసారి తెల్లవారుజామున 3 గంటల నుంచే ప్రారంభమయ్యాయి. అక్షర శ్రికార పూజల కోసం నాలుగు ప్రదేశాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేసి, అదనపు పూజారులను నియమించారు. సాయంత్రం 6 గంటల వరకు నిరంతరాయంగా పూజలు కొనసాగేందుకు చర్యలు తీసుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా నిబంధనలు అమలు చేయడానికి నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి శర్మిల ఆధ్వర్యంలో భారీ పోలీస్ బలగాన్ని మోహరించారు. భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్ ఫీల్డ్ స్థాయిలో ఏర్పాట్లను పర్యవేక్షించారు. రాష్ట్ర ప్రభుత్వ తరఫున రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్య అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. ఈ వేడుకలలో భాగంగా కామారెడ్డి జిల్లా బిర్కూర్ నుండి 110 మంది సరస్వతి దీక్షాపరులు కాలినడకన బాసర చేరి, వసంతపంచమి రోజున అమ్మవారి సన్నిధిలో దీక్ష స్వీకరించనున్నారు.
