
DNews: Feb 11: హైదరాబాద్లోని బంజారా హిల్స్లో ఉన్న డిజైనర్ స్టోర్లో జరిగిన దొంగతనాన్ని పోలీసులు ఛేదించారు. ఈ స్టోర్ను నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి భార్య అనుష్రీ రెడ్డి నిర్వహిస్తున్నారు. ఈ నెల 6వ తేదీన స్టోర్లో దొంగతనం జరిగింది. హౌస్కీపింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న అస్సాం రాష్ట్రానికి చెందిన అమినుల్ హక్ (38)నే నిందితుడిగా పోలీసులు గుర్తించారు.
అమినుల్ హక్ గత కొన్ని నెలలుగా విశ్వాసపూర్వకంగా పనిచేస్తున్నప్పటికీ, ఆ రాత్రి ముందస్తు ప్రణాళికతో స్టోర్లోకి ప్రవేశించాడు. సీసీటీవీ కెమెరాలకు చిక్కకుండా కిటికీ ద్వారా లోపలికి వెళ్లి, స్క్రూడ్రైవర్ సహాయంతో లాకర్ను తెరిచి రూ. 2.43 లక్షల నగదును దొంగిలించాడు. దొంగిలించిన డబ్బును తన ఇంటి చెత్త బుట్టలో దాచిపెట్టాడు. మరుసటి రోజు ఉదయం విధులకు వచ్చి, స్టోర్లో దొంగతనం జరిగిందని యజమానులకు తెలిపాడు.
సీసీటీవీ ఆధారాలు స్పష్టంగా లేకపోవడంతో పోలీసులు క్లూస్ టీమ్ను రంగంలోకి దించారు. కిటికీ వద్ద లభించిన చెప్పుల ముద్రలు కీలక ఆధారంగా మారాయి. ఆ ముద్రలు అమినుల్ హక్ చెప్పులతో సరిపోవడంతో అతడిని అరెస్టు చేశారు. విచారణలో నిందితుడు నేరాన్ని ఒప్పుకున్నాడు. పోలీసులు అతని వద్ద నుంచి రూ. 2.30 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.
