
DNews:25 OCT:ఓదెల, అక్టోబర్ 25: పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని పలు గ్రామాల్లో శనివారం మధ్యాహ్నం ఆకస్మికంగా కురిసిన వర్షానికి రైతులు ఆరబెట్టిన ధాన్యం తడిసిపోయింది. గత మూడు రోజులుగా తుఫాన్ ప్రభావం వల్ల వర్షాలు పడుతుండటంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ప్రస్తుతం వానాకాలం వరి పంట కోతకు రావడంతో రైతులు తమ వడ్లను ధాన్యం కొనుగోలు కేంద్రాలు, రోడ్లు, మైదాన ప్రాంతాల్లో పోసి తేమ శాతం తగ్గించడానికి ఆరబెడుతున్నారు. సరిగ్గా ఈ సమయంలో వస్తున్న ఆకస్మిక వర్షాలు రైతుల కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.
గత మూడు రోజులుగా మధ్యాహ్నం వేళ వింత వాతావరణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఉదయం ఎండ తీవ్రత అధికంగా ఉండటంతో రైతులు ధాన్యాన్ని ఆరబెడుతున్నారు. కానీ, ఒక్కసారిగా వాతావరణం మారిపోయి, కేవలం ఐదు నుంచి పది నిమిషాలు మాత్రమే టపటపామని వర్షం పడి వెళ్లిపోతుంది. ఈ కొద్దిపాటి వర్షానికే ఆరబెట్టిన వడ్లు తడిసిపోతున్నాయి. పాలిథిన్ కవర్లు కప్పే సమయం కూడా దొరకకపోవడంతో పలువురు రైతుల వడ్లు తడిసిపోయాయి.
ఈ విచిత్ర పరిస్థితి వల్ల రైతులు అయోమయానికి గురవుతున్నారు. ధాన్యం తడవకుండా, నష్టం జరగకుండా ఉండేందుకు ప్రభుత్వం వెంటనే కొనుగోలును ప్రారంభించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
