
DSports:23 OCT:ముంబై, ఐపీఎల్ 2026 సీజన్ వేలానికి ఇంకా సమయం ఉన్నప్పటికీ, ఫ్రాంచైజీలు తమ జట్ల బలపరచేందుకు తెరవెనుక కసరత్తులు ప్రారంభించాయి. ప్లేయర్ ట్రేడింగ్ విండో ఓపెన్ అవడంతో ఆటగాళ్ల బదిలీ చర్చలు వేగం పందుకున్నాయి. ఈ నేపథ్యంలో సన్రైజర్స్ హైదరాబాద్ వికెట్కీపర్–బ్యాటర్ ఇషాన్ కిషన్ అత్యధిక డిమాండ్లో ఉన్న ఆటగాడిగా నిలిచాడు
సమాచారం ప్రకారం, ఐదు సార్లు చాంపియన్ అయిన ముంబై ఇండియన్స్ మళ్లీ ఇషాన్ను తమ జట్టులోకి తీసుకురావడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అదే సమయంలో కోల్కతా నైట్రైడర్స్ (కేకేఆర్), రాజస్తాన్ రాయల్స్ జట్లు కూడా సన్రైజర్స్తో సంప్రదింపులు జరిపినట్టు తెలుస్తోంది. అయితే, ట్రేడ్పై సన్రైజర్స్ హైదరాబాద్ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు.
ముంబై జట్టుకు ప్రస్తుతం నాణ్యమైన భారత వికెట్కీపర్–బ్యాటర్ అత్యవసరం. ఇషాన్ రాకతో జట్టు కాంబినేషన్లో ఒక విదేశీ ఆటగాడికి అదనపు అవకాశం లభిస్తుంది. అదేవిధంగా హార్దిక్ పాండ్యా తర్వాత జట్టు నాయకత్వ బాధ్యతలు చేపట్టగల యంగ్ ఇండియన్గా ఇషాన్ను ముంబై భవిష్యత్ పెట్టుబడిగా భావిస్తోంది.
ఇక కేకేఆర్ జట్టుకు గత సీజన్లో ఫారిన్ కీపర్లు ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవడం, రాయల్స్ టీమ్లో సంజు శాంసన్ భవిష్యత్తుపై అనిశ్చితి నెలకొనడం వల్ల ఇషాన్ కిషన్ ఈ రెండు జట్లకూ కీలక టార్గెట్గా మారాడు.
గత సీజన్ వేలంలో రూ.11.25 కోట్లకు సన్రైజర్స్ కొనుగోలు చేసిన ఇషాన్ కిషన్ను వదిలే ఉద్దేశ్యం హైదరాబాద్ ఫ్రాంచైజీకి లేనట్టు తెలుస్తోంది. అయినప్పటికీ, ఈ ట్రేడ్ డీల్ ముంబై, హైదరాబాద్ మధ్య జరగబోయే చర్చలు, అలాగే ఆటగాడి అంగీకారం మీద ఆధారపడి ఉండనుంది.
ఇక అన్ని ఫ్రాంచైజీలు తమ రిటెన్షన్ జాబితాలను నవంబర్ 15లోగా సమర్పించాల్సి ఉండటంతో, ఆలోపే ఈ ట్రేడ్ డీల్ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది.
