
D News: 99వ అకాడమీ అవార్డ్స్ (Oscars 2027) కోసం భారత్ తరఫున అధికారిక ఎంట్రీగా మరాఠీ చిత్రం ‘గోంధల్’ ఎంపికైంది. ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (FFI) శుక్రవారం ఈ విషయాన్ని ప్రకటించింది. దేశవ్యాప్తంగా పరిశీలించిన 33 చిత్రాల్లో సంతోష్ దావఖర్ దర్శకత్వం వహించిన ‘గోంధల్’ను జ్యూరీ ఎంపిక చేసింది.
దీంతో ఆస్కార్ రేసులో నిలవాలని ఆశించిన తెలుగు సినిమాలకు నిరాశ ఎదురైంది. ఈసారి తెలుగు నుంచి రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’, రవితేజ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘ఇరుముడి’, సింగీతం శ్రీనివాసరావు చిత్రం ‘సింగ్ గీతం’, ‘ఇగ్వా’ సినిమాలు పరిశీలనకు వెళ్లాయి. అయితే వీటిలో ఏ ఒక్కటీ అధికారిక ఎంట్రీగా ఎంపిక కాలేదు.
‘గోంధల్’ కథేంటి?
సంతోష్ దావఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘గోంధల్’ సినిమా మహారాష్ట్ర సంప్రదాయ జానపద ఆచారం, కళారూపం ఆధారంగా రూపొందింది. రాత్రంతా జరిగే ఈ సంప్రదాయ వేడుకను కథలో కీలక అంశంగా మలిచారు. కొత్తగా పెళ్లైన జంట చుట్టూ మొదలయ్యే కథ.. ప్రేమ, మోసం, కుటుంబ కలహాలు, అనూహ్య పరిణామాల వైపు సాగుతుంది.
ఇషితా దేశ్ముఖ్, కిశోర్ కదమ్, యోగేశ్ సోహోని తదితరులు ఇందులో నటించారు. దర్శకుడు సంతోష్ దావఖర్కు అంతర్జాతీయ గుర్తింపు ఉంది. 2025లో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ‘గోంధల్’ చిత్రానికి ఆయన సిల్వర్ పీకాక్ అవార్డు అందుకున్నారు.
99వ ఆస్కార్ అవార్డుల వేడుక 2027 మార్చి 14న లాస్ ఏంజెల్స్లోని డాల్బీ థియేటర్లో జరగనుంది. భారత్ తరఫున ఎంపికైన ‘గోంధల్’ ఇప్పుడు అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో తదుపరి ఎంపిక ప్రక్రియలోకి వెళ్లనుంది.
