
D News: మహేష్ బాబు–ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘వారణాసి’పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా గురించి తాజాగా ఓ విదేశీ పాడ్కాస్ట్లో మహేష్ బాబు పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
రాజమౌళితో సినిమా ఎప్పుడు మొదలైందని అడిగినప్పుడు మహేష్ సరదాగా స్పందించారు. ‘మగధీర’ తర్వాత రాజమౌళిని కలిశానని, అప్పుడు తన చేతిలో మరో రెండు సినిమాలు ఉన్నాయని.. అవి పూర్తయ్యాక కలిసి సినిమా చేద్దామని రాజమౌళి చెప్పారని గుర్తుచేశారు. అయితే ఆ రెండు సినిమాలు పూర్తి చేయడానికి ఏకంగా 15 ఏళ్లు పట్టిందని మహేష్ నవ్వుతూ చెప్పారు.
రాజమౌళితో వర్కింగ్ స్టైల్పై..
రాజమౌళితో పనిచేయడం కష్టమని కొంతమంది తనను ముందే భయపెట్టారని మహేష్ తెలిపారు. కానీ షూటింగ్ మొదలైన తర్వాత తనకు అలాంటి అనుభవం ఎదురుకాలేదన్నారు. రీహార్సల్స్, పక్కా ప్లానింగ్, క్లారిటీతో రాజమౌళి షూటింగ్ను చాలా సులభంగా మార్చేస్తారని చెప్పారు.
అంతేకాదు.. రాజమౌళి వర్కింగ్ స్టైల్కు తాను పూర్తిగా అలవాటు పడిపోయానని మహేష్ అన్నారు. ఇకపై వేరే దర్శకులతో పనిచేసేటప్పుడు కూడా ఈ స్థాయి ప్లానింగ్ లేకపోతే కాస్త కష్టంగా అనిపించవచ్చని సరదాగా వ్యాఖ్యానించారు.
ప్రియాంక చోప్రా, పృథ్విరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటిస్తున్న ‘వారణాసి’పై ఇప్పటికే భారీ హైప్ ఉంది. మహేష్–రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.
