
D Spiritual: Sept 11: వినాయక మండపాలకు ఉచిత విద్యుత్
ఆంధ్రప్రదేశ్లో వినాయక చవితి వేడుకలను మరింత వైభవంగా నిర్వహించుకునేందుకు కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసే వినాయక మండపాలకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేయాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం అమలుకు సంబంధించి రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలు (APDISCOMs) స్పష్టమైన మార్గదర్శకాలు, విధివిధానాలను జారీ చేశాయి.
ఈ నిబంధనల ప్రకారం సెప్టెంబర్ 14 నుంచి సెప్టెంబర్ 22 వరకు జరిగే వినాయక చవితి ఉత్సవాల కాలంలో గ్రామీణ ప్రాంతాల్లోని గణేష్ మండపాలకు 3 కిలోవాట్ల (kW) వరకు, పట్టణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసే మండపాలకు 5 కిలోవాట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా చేయనున్నారు. ఈ సదుపాయాన్ని పొందాలంటే ఉత్సవ నిర్వాహకులు విద్యుత్ శాఖకు ముందస్తుగా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.
అదనపు లోడ్ ఉంటే తాత్కాలిక కనెక్షన్
నిర్దేశించిన పరిమితికి మించి విద్యుత్ అవసరమయ్యే పెద్ద గణేష్ మండపాల నిర్వాహకులు నిబంధనల ప్రకారం తాత్కాలిక విద్యుత్ కనెక్షన్ (Temporary Connection) కోసం దరఖాస్తు చేసుకోవాలని అధికారులు స్పష్టం చేశారు. అదనపు లోడ్ను అధికారిక అనుమతితోనే వినియోగించాలని సూచించారు.
విద్యుత్ భద్రతా ప్రమాణాలు తప్పనిసరి
గణేష్ మండపాల వద్ద నాణ్యమైన విద్యుత్ వైరింగ్ను మాత్రమే ఉపయోగించాలని విద్యుత్ శాఖ అధికారులు సూచించారు. ఎలాంటి అక్రమ విద్యుత్ కనెక్షన్లు, హుక్కింగ్లకు పాల్పడకూడదని హెచ్చరించారు. ప్రమాద రహితంగా వినాయక చవితి వేడుకలను నిర్వహించేందుకు ప్రతి మండపం వద్ద విద్యుత్ భద్రతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు.
కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల రాష్ట్రవ్యాప్తంగా వినాయక ఉత్సవ కమిటీలకు ఆర్థికంగా కొంత ఊరట లభించనుంది. అదే సమయంలో విద్యుత్ వినియోగంలో నిబంధనలు, భద్రతా ప్రమాణాలను పాటిస్తూ వేడుకలను నిర్వహించాలని అధికారులు సూచించారు.
