
D News: తెలంగాణ అసెంబ్లీ ముట్టడికి ఆశా వర్కర్లు భారీగా తరలివచ్చారు. నెలకు రూ.18 వేల వేతనం, ఉద్యోగ భద్రత, PF, ESI సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్లో ‘చలో అసెంబ్లీ’ కార్యక్రమం నిర్వహించారు.
చలో అసెంబ్లీకి వేలాది మంది ఆశా వర్కర్లు
CITU ASHA యూనియన్ ఆధ్వర్యంలో మంగళవారం భారీ నిరసన చేపట్టారు. దోమలగూడ నుంచి ప్రారంభమైన ర్యాలీ ఇందిరాపార్క్ సిగ్నల్ వద్దకు చేరుకుని ధర్నాగా మారింది.
రూ.18 వేల వేతనం.. PF, ESI డిమాండ్
ఆశా వర్కర్లు తమకు నెలకు కనీసం రూ.18 వేల వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ భద్రతతో పాటు PF, ESI సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.
పోలీసులతో ఉద్రిక్తత
నిరసనను పోలీసులు చెదరగొట్టేందుకు ప్రయత్నించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. తోపులాటలో కొందరు కార్మికులకు స్వల్ప గాయాలయ్యాయని, మరికొందరు స్పృహ తప్పారని యూనియన్ వర్గాలు తెలిపాయి.
పలువురు యూనియన్ నేతల ముందస్తు అరెస్టులు
చలో అసెంబ్లీకి ముందు పలువురు కార్మిక సంఘాల నేతలను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నట్లు యూనియన్ పేర్కొంది. CITU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, ఉపాధ్యక్షుడు ఎస్వీ రమణతో పాటు పలువురు ఆశా యూనియన్ ప్రతినిధులను వివిధ జిల్లాల్లో నిర్బంధించినట్లు తెలిపింది.
డిమాండ్లు పరిష్కరించకపోతే నిరవధిక సమ్మె
ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించకపోతే అసెంబ్లీ సమావేశాలు ముగిసేలోపు నిరవధిక సమ్మెకు వెళ్తామని రాష్ట్ర ఆశా యూనియన్ అధ్యక్షురాలు పి. జయలక్ష్మి హెచ్చరించారు. శాంతియుత నిరసనలను అణచివేస్తున్నారని ఆమె ప్రభుత్వంపై విమర్శలు చేశారు.
