
D Educt: Sept 5: పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ ప్రవేశాలకు నోటిఫికేషన్.. సెప్టెంబర్ 15 వరకు దరఖాస్తులు
డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం (NTRUHS) 2026-27 విద్యా సంవత్సరానికి రెండేళ్ల పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ కోర్సులో కన్వీనర్ కోటా ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. నర్సింగ్లో కెరీర్ కొనసాగిస్తూ ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే అర్హత కలిగిన అభ్యర్థులు యూనివర్సిటీ అధికారిక పోర్టల్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఇంటర్మీడియట్తో పాటు జీఎన్ఎం (GNM) కోర్సు పూర్తి చేసి, స్టేట్ నర్సింగ్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ కలిగి ఉన్న అభ్యర్థులు ఈ ప్రవేశాలకు అర్హులు. అయితే ఒకటిన్నర సంవత్సరాల MPHW కోర్సు చేసిన వారు ఈ ప్రవేశాలకు అనర్హులు. ఈ ఏడాది డిసెంబర్ 31 నాటికి 21 ఏళ్లు నిండిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులకు గరిష్ఠ వయోపరిమితి లేదని విశ్వవిద్యాలయం వెల్లడించింది.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 4 ఉదయం 11 గంటలకు ప్రారంభమైంది. అభ్యర్థులు సెప్టెంబర్ 15 సాయంత్రం 4 గంటల వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. దరఖాస్తు సమయంలో విద్యార్హతకు సంబంధించిన ధ్రువపత్రాలు, నర్సింగ్ సర్టిఫికెట్లను ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.
దరఖాస్తు రుసుమును ఓసీ అభ్యర్థులకు రూ.2,500, బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.2,000గా నిర్ణయించారు. అర్హత ఉన్న అభ్యర్థులు చివరి తేదీ వరకు వేచి చూడకుండా అవసరమైన ధ్రువపత్రాలను సిద్ధం చేసుకుని దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాలని యూనివర్సిటీ అధికారులు సూచించారు.
