
D News: కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనను పూర్తి చేసుకున్న సందర్భంగా కొత్తకోట, మదనాపురం మండలాల్లో సంబరాలు, బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్రెడ్డి పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై కీలక వ్యాఖ్యలు చేశారు.
బీఆర్ఎస్ పాలనపై ఎమ్మెల్యే విమర్శలు
బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో దేవరకద్ర నియోజకవర్గ అభివృద్ధిని పూర్తిగా విస్మరించిందని మధుసూదన్రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెయ్యి రోజుల్లోనే అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందని అన్నారు.
3,500 ఇందిరమ్మ ఇళ్ల మంజూరు
నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశామని ఎమ్మెల్యే తెలిపారు. కొత్తకోట, మదనాపురం ప్రాంతాల్లో వేలాది కుటుంబాలకు ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలిండర్లు, కొత్త రేషన్ కార్డులు, సన్నబియ్యం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలు అందుతున్నాయని చెప్పారు.
బ్రిడ్జిలు, సాగునీటి పనులకు నిధులు
మదనాపురం–ఆత్మకూరు బ్రిడ్జి నిర్మాణానికి రూ.6 కోట్లు కేటాయించి పనులు పూర్తి చేశామని మధుసూదన్రెడ్డి తెలిపారు. శంకరపేట–దంతనూర్ ప్రాంతంలో రూ.కోటి వ్యయంతో మరో బ్రిడ్జి నిర్మించామని, మూడు లిఫ్ట్ ఇరిగేషన్ పథకాల మరమ్మతులకు రూ.5 కోట్లు తీసుకొచ్చామని వెల్లడించారు.
వైద్యం, విద్యకు ప్రాధాన్యత
దేవరకద్రలో 100 పడకల ఆసుపత్రి, కొత్తకోటలో 30 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. దేవరకద్రలో డిగ్రీ కళాశాల, చిన్నచింతకుంటలో జూనియర్ కళాశాల ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.
ఆల వెంకటేశ్వర్రెడ్డిపై మధుసూదన్రెడ్డి ఫైర్
రైతులకు ఏకకాలంలో రూ.2 లక్షల వరకు రుణమాఫీ, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.10 లక్షల ఆరోగ్యశ్రీ వంటి హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. గత ప్రభుత్వం హామీలు నెరవేర్చకుండా రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులను చూసి మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అసహనానికి గురవుతున్నారని మధుసూదన్రెడ్డి ఎద్దేవా చేశారు.
