
D-News: సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (CMC) పరిధిలో అక్రమ నిర్మాణాలపై అధికారులు చర్యలు ముమ్మరం చేశారు. మంగళవారం ఆగస్టు 25న మూడు జోన్లలో చేపట్టిన ప్రత్యేక డ్రైవ్లో 17 అనుమతులు లేని నిర్మాణాలను కూల్చివేశారు. నిర్మాణ దశలో ఉన్న భవనాలపైనే ప్రధానంగా అధికారులు చర్యలు తీసుకున్నారు.
సెరిలింగంపల్లి, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ జోన్లలో ఈ కూల్చివేతలు జరిగాయి. అక్రమ నిర్మాణాలపై 11 నోటీసులు కూడా జారీ చేసిన అధికారులు.. మరికొన్ని అనధికార నిర్మాణాలను గుర్తించి తదుపరి చర్యలకు సిద్ధమవుతున్నారు.
గచ్చిబౌలి ఘటన తర్వాత నిఘా పెంపు
ఇటీవల గచ్చిబౌలిలోని అంజయ్యనగర్లో అనుమతులు లేకుండా నిర్మిస్తున్న భవనం కూలిపోయిన ఘటన తర్వాత అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. ఈ ఘటనలో కార్మికులు ప్రాణాలు కోల్పోవడంతో అక్రమ, నిబంధనలకు విరుద్ధమైన నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు.
CMC కమిషనర్ ఆదేశాలతో టౌన్ ప్లానింగ్, ఎన్ఫోర్స్మెంట్ బృందాలు క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహిస్తున్నాయి. అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడుతున్న ప్రాంతాలను గుర్తించి వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
800కు పైగా నిర్మాణాల గుర్తింపు
CMC పరిధిలో గత కొంతకాలంగా పెద్ద సంఖ్యలో అనధికార నిర్మాణాలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, సెరిలింగంపల్లి జోన్లలో అక్రమ నిర్మాణాలపై తనిఖీలు కొనసాగుతున్నాయి.
భవన నిర్మాణానికి ముందు సంబంధిత అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించి నిర్మాణాలు చేపడితే నోటీసులు ఇవ్వడంతో పాటు అవసరమైతే కూల్చివేత చర్యలు కూడా ఉంటాయని స్పష్టం చేస్తున్నారు.
ప్రజల భద్రతను దృష్టిలో పెట్టుకుని అక్రమ నిర్మాణాలపై ఎలాంటి రాజీ ఉండదని CMC అధికారులు చెబుతున్నారు. రాబోయే రోజుల్లోనూ ఈ తరహా తనిఖీలు, కూల్చివేతలు కొనసాగించే అవకాశం ఉంది.
