
D Educt: Aug 21: విద్యార్థులకు ఉపాధికి అవసరమైన నైపుణ్యాలను చిన్నతనం నుంచే అందించాలని నీతి ఆయోగ్ సూచించింది. విద్యార్థుల్లో ఉపాధి సామర్థ్యాలను పెంపొందించడాన్ని పాఠశాల విద్యా వ్యవస్థలో అంతర్భాగంగా మార్చాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఇందుకోసం 6వ తరగతి నుంచే వ్యవస్థాపక, ఉపాధి నైపుణ్యాల శిక్షణను ప్రారంభించాలని, 9వ తరగతి నుంచి క్రమబద్ధమైన వృత్తి విద్యా కోర్సులను ప్రవేశపెట్టాలని ప్రతిపాదించింది. ‘రీఇమేజినింగ్ స్కిల్లింగ్ ఫర్ వికసిత్ భారత్@2047’ పేరుతో రూపొందించిన నివేదికలో నీతి ఆయోగ్ ఈ సూచనలు చేసింది.
11, 12వ తరగతుల విద్యార్థులందరికీ ‘సాధారణ ఉపాధి, వ్యవస్థాపక నైపుణ్యాలు’ అనే అంశాన్ని ప్రత్యేక సబ్జెక్టుగా కొనసాగించాలని నీతి ఆయోగ్ సూచించింది. 10, 12వ తరగతుల్లో వృత్తి విద్యా సబ్జెక్టులకు సాధారణ విద్యతో సమాన ప్రాధాన్యత కల్పించేలా విద్యా మండళ్ల విధానాలను సవరించాలని పేర్కొంది. అలాగే పదో తరగతిలో వృత్తి విద్యకు సంబంధించిన బోర్డు సర్టిఫికేషన్ను ఆమోదించే విధంగా రాష్ట్ర విద్యా మండళ్ల విధానాల్లో మార్పులు తీసుకురావాలని సూచించింది.
జాతీయ విద్యా విధానం-2020, జాతీయ పాఠ్యప్రణాళిక వంటి మార్గదర్శకాలు 6వ తరగతి నుంచే వృత్తి విద్య, ఉపాధి, వ్యవస్థాపక నైపుణ్యాలను అందించాలని సూచిస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో వాటి అమలు నామమాత్రంగానే ఉందని నీతి ఆయోగ్ అభిప్రాయపడింది. విద్యార్థులకు పుస్తక జ్ఞానంతో పాటు భవిష్యత్ ఉపాధికి అవసరమైన ప్రాక్టికల్ నైపుణ్యాలను అందించడంపై మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని తెలిపింది.
మారుతున్న మార్కెట్ పరిస్థితులు, సాంకేతిక అవసరాలకు అనుగుణంగా విద్యార్థులు ఎప్పటికప్పుడు కొత్త నైపుణ్యాలను నేర్చుకునేలా ఉన్నత విద్యా వ్యవస్థను తీర్చిదిద్దాలని నివేదిక సూచించింది. విద్య పూర్తయ్యే సమయానికి విద్యార్థులు ఉద్యోగాలకు సిద్ధంగా ఉండేలా కోర్సుల రూపకల్పన జరగాలని పేర్కొంది. కేవలం సాధారణ లేదా కాలం చెల్లిన డిగ్రీలు చదవడం వల్ల విద్యార్థుల ఉపాధి అవకాశాలు గణనీయంగా మెరుగుపడవని స్పష్టం చేసింది.
చదువులు, ఉపాధి మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించేందుకు పరిశ్రమలతో విద్యా సంస్థలు మరింతగా అనుసంధానం కావాలని నీతి ఆయోగ్ సూచించింది. ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్య విధానంలో వృత్తి శిక్షణకు అవకాశం కల్పించే డిగ్రీలు, డిప్లొమా కోర్సులను కొత్త సిలబస్తో అందుబాటులోకి తీసుకురావాలని పేర్కొంది. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా కోర్సులను రూపొందించడం ద్వారా విద్యార్థులకు చదువుతో పాటు ప్రాక్టికల్ అనుభవం, నైపుణ్యాలు లభించి ఉద్యోగ అవకాశాలు మరింత మెరుగుపడతాయని నివేదిక వివరించింది.
