
D Educt: Aug 20: ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ భారతీయ కాలేజీ విద్యార్థులకు శుభవార్త చెప్పింది. విద్యార్థుల చదువుకు ఉపయోగపడేలా ‘గూగుల్ ఏఐ ప్లస్’ సబ్స్క్రిప్షన్ను ఏడాది పాటు ఉచితంగా అందించనున్నట్లు ప్రకటించింది. గూగుల్ ఏఐ అసిస్టెంట్, సెర్చ్ ద్వారా పలు ఎడ్యుకేషనల్ టూల్స్ను విద్యార్థులు వినియోగించుకునే అవకాశం కల్పిస్తోంది.
అమెరికాలోని కాలేజీ విద్యార్థులకు ఇప్పటికే గూగుల్ ఏఐ ప్రో ప్లాన్ను ఉచితంగా అందిస్తున్న సంస్థ.. తాజాగా భారతీయ కాలేజీ విద్యార్థుల కోసం ‘గూగుల్ ఏఐ ప్లస్’ను ఏడాది పాటు ఉచితంగా అందించనుంది. ఈ సబ్స్క్రిప్షన్లో జీమెయిల్, డాక్స్లో జెమినై సేవలను వినియోగించుకోవచ్చు.
రీసెర్చ్, అనాలసిస్ కోసం నోట్బుక్ ఎల్ఎమ్ వంటి ఏఐ ఆధారిత సాధనాలను కూడా విద్యార్థులు ఉపయోగించుకోవచ్చు. అలాగే ఫొటోలు, గూగుల్ డ్రైవ్, జీమెయిల్ వంటి సేవలకు 400 జీబీ స్టోరేజీని ఉచితంగా పొందే అవకాశం ఉంటుంది. సాధారణంగా గూగుల్ ఏఐ ప్లస్ సబ్స్క్రిప్షన్ ధర నెలకు రూ.399గా, ఏడాదికి రూ.4,788గా ఉంది.
గూగుల్ ఏఐ ప్లస్లో భాగంగా స్టడీ నోట్బుక్స్, ఫ్లాష్కార్డులు రూపొందించడం, ప్రాక్టీస్ క్విజ్లు తయారు చేసుకోవడం వంటి సదుపాయాలు కూడా అందుబాటులో ఉంటాయి. విద్యార్థులు తమ చదువుకు అవసరమైన అంశాలను సులభంగా అర్థం చేసుకునేందుకు జెమినై లైవ్ సేవను కూడా ఉపయోగించుకోవచ్చు.
ఇదే సమయంలో విద్యార్థులకు గూగుల్ ఏఐ ప్రో, యూట్యూబ్ ప్రీమియం సబ్స్క్రిప్షన్లపై 70 శాతం వరకు డిస్కౌంట్ను కూడా గూగుల్ అందిస్తోంది. గూగుల్ ఏఐ ప్రో సబ్స్క్రిప్షన్తో యూట్యూబ్ ప్రీమియం లైట్ సదుపాయాన్ని కూడా పొందే అవకాశం ఉంది.
అర్హత ఉన్న విద్యార్థులు తమ వ్యక్తిగత గూగుల్ అకౌంట్తో గూగుల్ వన్లో సైన్ అప్ చేసుకోవచ్చు. విద్యార్థుల అర్హతను గూగుల్.. SheerID ప్లాట్ఫామ్ ద్వారా ధ్రువీకరించనుంది. ఈ ఆఫర్ ద్వారా భారతీయ విద్యార్థులు ఏఐ టూల్స్ను తమ చదువు, రీసెర్చ్, ప్రాజెక్టులు, నైపుణ్యాభివృద్ధికి మరింత సమర్థంగా వినియోగించుకునే అవకాశం లభించనుంది.
