
D-News: భారత్లో టెలికాం, నెట్వర్క్ పరికరాల తయారీ రంగం వేగంగా అభివృద్ధి చెందే అవకాశం ఉందని నీతి ఆయోగ్ నివేదిక తెలిపింది. ప్రస్తుతం ఈ రంగం విదేశీ దిగుమతులపై, ముఖ్యంగా చైనాపై ఎక్కువగా ఆధారపడుతోంది. అయితే సరైన ప్రభుత్వ విధానాలు, ప్రోత్సాహకాలు అందిస్తే దేశీయ తయారీ పెరిగి, ఎగుమతులు భారీగా వృద్ధి చెందే అవకాశం ఉందని పేర్కొంది. ప్రస్తుతం టెలికాం, నెట్వర్క్ పరికరాల ఎగుమతులు దేశ మొత్తం ఎగుమతుల్లో కేవలం 0.2 నుంచి 0.3 శాతం మాత్రమే ఉన్నాయి. 2020-24 మధ్య కాలంలో భారత్ నుంచి ఏటా సుమారు 60 కోట్ల నుంచి 100 కోట్ల డాలర్ల విలువైన పరికరాలు ఎగుమతి అయ్యాయి. అదే సమయంలో ఏటా 400 కోట్ల నుంచి 500 కోట్ల డాలర్ల విలువైన పరికరాలను దిగుమతి చేసుకున్నాం.
ముఖ్యంగా 4జీ, 5జీ యాంటెనాలు, సంకేత ప్రాసెసర్లు వంటి కీలక భాగాల కోసం భారత్ 80 శాతానికి పైగా చైనాపైనే ఆధారపడుతోంది. దీంతో అంతర్జాతీయ సరఫరా వ్యవస్థలో సమస్యలు తలెత్తితే దేశీయ తయారీపై ప్రభావం పడే ప్రమాదం ఉంది. అంతేకాకుండా, ప్రస్తుతం దేశంలో జరుగుతున్న పరికరాల తయారీలో ఎక్కువ భాగం కేవలం విడిభాగాలను కలిపే స్థాయిలోనే ఉంది. దీంతో దేశీయంగా జోడించే విలువ తరచుగా 20 శాతానికి కూడా తక్కువగా ఉంటోంది.
మరోవైపు, భారత కంపెనీలపై విదేశీ పోటీదారులతో పోలిస్తే పన్నులు, ఆర్థిక భారాలు ఎక్కువగా ఉన్నాయని నివేదిక తెలిపింది. అందువల్ల దేశీయ తయారీ సంస్థలకు మరింత ప్రోత్సాహం అవసరం. ఇప్పటికే ప్రభుత్వం ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం వంటి చర్యలను అమలు చేస్తోంది. అయితే మరింత బలమైన విధానపరమైన మద్దతు అందిస్తే ఈ రంగం దేశ స్థూల దేశీయోత్పత్తిలో 1 నుంచి 1.5 శాతం వరకు వాటా కలిగి ఉండవచ్చని నీతి ఆయోగ్ అంచనా వేసింది. అదే సమయంలో సుమారు 5 లక్షల నైపుణ్య ఉద్యోగాలు ఏర్పడే అవకాశం ఉంది. అలాగే 2035 నాటికి భారత్ను 5000 కోట్ల డాలర్ల టెలికం పరికరాల ఎగుమతి కేంద్రంగా మార్చవచ్చని పేర్కొంది.
మొత్తంగా, దేశీయ తయారీని పెంచడం, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం, ఎగుమతులను ప్రోత్సహించడం ద్వారా భారత్ ప్రపంచ టెలికం పరికరాల తయారీలో కీలక దేశంగా ఎదగవచ్చని నీతి ఆయోగ్ తెలిపింది. ఇదే సమయంలో, దేశీయ సంస్థలు అధిక విలువ కలిగిన టెలికం పరికరాల తయారీపై మరింత దృష్టి పెట్టాలి. ముఖ్యంగా 5జీ, 6జీ సాంకేతికత, సంకేత పరికరాలు, కాంతి ఆధారిత పరికరాలు, చిప్ల వంటి కీలక రంగాల్లో స్థానిక తయారీ పెరగాలి. అలాగే పరిశోధన, కొత్త ఆవిష్కరణలకు ప్రోత్సాహం ఇవ్వాలి. దీంతో విదేశీ కంపెనీలపై ఆధారపడటం తగ్గడమే కాకుండా, దేశంలో కొత్త వ్యాపార అవకాశాలు, నైపుణ్య ఉద్యోగాలు పెరుగుతాయి. అంతేకాకుండా, అంతర్జాతీయ సంస్థలను భారత్లో తయారీ కేంద్రాలు ఏర్పాటు చేసేలా ఆకర్షించవచ్చు.
