
D Spiritual: Aug 14: TTD Srivari Seva Training: 1,888 మంది సూపర్వైజర్లకు శిక్షణ.. 43 రోజుల పాటు కొనసాగిన కార్యక్రమం
తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు మరింత నాణ్యమైన, వేగవంతమైన, క్రమశిక్షణతో కూడిన సేవలు అందించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానాలు (టీటీడీ) నిర్వహిస్తున్న ‘శ్రీవారి సేవ – ట్రైన్ ది ట్రైనర్స్’ రెండో విడత శిక్షణ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. మొత్తం 43 రోజుల పాటు తిరుమలలో ఈ శిక్షణ కొనసాగింది.
జూలై 1న ప్రారంభమైన రెండో విడత శిక్షణలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాలకు చెందిన మొత్తం 1,888 మంది గ్రూప్ సూపర్వైజర్లు పాల్గొన్నారు. మొదటి విడతలో శిక్షణ పొందిన వారిని కలుపుకుని ఇప్పటివరకు దాదాపు 3,000 మంది గ్రూప్ సూపర్వైజర్లకు అధునాతన సేవా నైపుణ్యాల్లో శిక్షణ పూర్తయినట్లు టీటీడీ తెలిపింది.
ఈ శిక్షణలో సేవకుల్లో సేవాభావం, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, సమర్థవంతమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలను పెంపొందించడంపై ప్రత్యేక దృష్టి సారించారు. శ్రీవారి సేవలో భక్తులతో మర్యాదగా వ్యవహరించడం, వారి సమస్యలను అర్థం చేసుకోవడం, అవసరమైన సమయంలో సరైన మార్గదర్శకత్వం అందించడం వంటి అంశాలపై సూపర్వైజర్లకు అవగాహన కల్పించారు.
వేద పాఠశాల అధ్యాపకులు, టీటీడీలోని వివిధ విభాగాలకు చెందిన నిపుణులు శిక్షణలో భాగంగా పలు అంశాలపై బోధించారు. శ్రీవారి వైభవం, తిరుమల మహత్యం, పురాణ ప్రాశస్త్యం, పూజలు, కైంకర్యాల విశిష్టత వంటి విషయాలపై సేవకులకు అవగాహన కల్పించారు.
శిక్షణలో భాగంగా సూపర్వైజర్లకు క్షేత్రస్థాయి అనుభవాన్ని కూడా అందించారు. లడ్డూ విక్రయ కౌంటర్లు, శ్రీ వేంకటేశ్వర అన్నప్రసాద కేంద్రం, శ్రీవారి కళ్యాణకట్ట, వైకుంఠం క్యూ కాంప్లెక్స్, రిసెప్షన్ విభాగాలను సందర్శించే అవకాశం కల్పించారు. ఆయా ప్రాంతాల్లో సేవకులు ఎదుర్కొనే సమస్యలు, భక్తుల సందేహాలు, వాటికి తక్షణ పరిష్కార మార్గాలపై ప్రత్యక్ష అవగాహన కల్పించారు.
శిక్షణలో పాల్గొన్న సేవకులకు ట్రైనింగ్ కిట్తో పాటు గ్రూప్ సూపర్వైజర్ మాన్యువల్ను అందించారు. హిందూ ధర్మ ప్రచార పరిషత్ ప్రచురించిన గోవింద నామాలు, భగవద్గీత, శ్రీనివాస గాథ, విష్ణు సహస్రనామం, లక్ష్మీ అష్టోత్తరం, లలితా సహస్రనామం వంటి గ్రంథాలను కూడా అందించారు.
శ్రీవారి సేవలో సూపర్వైజర్ల పనితీరును నిరంతరం పర్యవేక్షించేందుకు టీటీడీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఆగస్టు 1న ఐదుగురు రిటైర్డ్ అధికారులను ప్రత్యేకాధికారులుగా నియమించింది. వీరు సేవకుల పనితీరును పరిశీలిస్తూ అవసరమైన సూచనలు, మార్గదర్శకాలు అందించనున్నారు.
స్థానికంగానే ప్రాథమిక శిక్షణ
శిక్షణ పొందిన ట్రైనర్లు ఇకపై తమ తమ మండలాలు, జిల్లాల్లో శ్రీవారి సేవకు ఆన్లైన్ ద్వారా నమోదు చేసుకున్న సేవకులకు తిరుమలకు బయలుదేరే ముందే ప్రాథమిక శిక్షణ అందించనున్నారు. సేవకులకు ముందుగానే అవసరమైన అవగాహన, క్రమశిక్షణ, సేవా విధానాలపై శిక్షణ ఇవ్వడం ద్వారా వారు తిరుమలకు చేరుకున్న వెంటనే పూర్తి సంసిద్ధతతో సేవలు అందించే అవకాశం ఉంటుందని టీటీడీ భావిస్తోంది.
ఈ విధానం ద్వారా శ్రీవారి సేవలో పాల్గొనే వాలంటీర్ల నైపుణ్యాలు మరింత మెరుగుపడి, తిరుమలకు వచ్చే భక్తులకు మరింత నాణ్యమైన సేవలు అందుతాయని టీటీడీ అధికారులు తెలిపారు.
