
D News: Aug 11: తెలంగాణలో వర్షాలు కురవాలని కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం వరుణ యాగాలు నిర్వహించడంపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ప్రజా సమస్యలను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పరిష్కరించకుండా యాగాలు నిర్వహించడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి సంబంధించిన మోటార్లను ఆన్ చేసి రైతులకు సాగునీరు అందించకుండా వరుణ యాగాలు నిర్వహించడం ప్రజల దృష్టిని మళ్లించే చర్యగా కేటీఆర్ అభివర్ణించారు. రైతాంగానికి నీటిని అందించేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
“గురువుకు గురుదక్షిణ చెల్లించే నెపంతో నీళ్లను వదిలేయడం కాకుండా, తక్షణమే కాళేశ్వరం మోటార్లు ఆన్ చేసి నీటిని పంపింగ్ చేయండి. ఆ తర్వాత యాగాలు చేస్తే కొంతైనా ఫలితం ఉంటుంది” అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వం ముందుగా సాగునీటి సమస్యను పరిష్కరించడంపై దృష్టి పెట్టాలని ఆయన సూచించారు.
ఇదిలా ఉండగా, తెలంగాణ ప్రాజెక్టులకు సంబంధించిన మరో కీలక అంశంపై కూడా కేటీఆర్ స్పందించారు. గోదావరి నదీ యాజమాన్య బోర్డు (GRMB) సమావేశంలో తెలంగాణకు చెందిన ఏడు ముఖ్యమైన ప్రాజెక్టులను రద్దు చేసే ప్రతిపాదనలపై చర్చ జరుగుతోందని ఆయన ఆరోపించారు. ఈ ప్రతిపాదనలను తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించాలని డిమాండ్ చేశారు.
కేంద్రం ప్రతిపాదించిన నిర్ణయాన్ని ప్రజా వ్యతిరేక చర్యగా అభివర్ణించిన కేటీఆర్.. GRMB సమావేశాన్ని రాష్ట్ర ప్రభుత్వం బహిష్కరించాలని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రయోజనాలు, నీటి హక్కులను కాపాడేందుకు ప్రభుత్వం ఈ విషయంలో కఠినంగా వ్యవహరించాలని కోరారు.
ఒకవేళ కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశంపై వెనక్కి తగ్గకుండా సమావేశాన్ని ముందుకు తీసుకెళ్తే, తెలంగాణ హక్కుల పరిరక్షణ కోసం బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ‘జలసౌధ’ను ముట్టడిస్తామని కేటీఆర్ హెచ్చరించారు. రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశాల్లో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఆయన స్పష్టం చేశారు.
