
D News: Aug 10: దేశ రాజధాని ఢిల్లీలో ప్రశాంతంగా నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జ్, బలప్రయోగం చేయడంపై లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం శాంతియుతంగా ఆందోళన చేస్తున్న వారిని అణచివేసేందుకు పోలీసులు పెల్లెట్ గన్స్, ముళ్ల లాఠీలు, టియర్ గ్యాస్ వంటి వాటిని ఉపయోగించారని ఆయన సోషల్ మీడియా వేదికగా ఆరోపించారు.
మహిళా విద్యార్థుల పట్ల పోలీసులు దారుణంగా వ్యవహరించారని రాహుల్ గాంధీ ఆరోపించారు. పోలీసుల దాడిలో పలువురు యువతులకు తీవ్ర గాయాలయ్యాయని, మైనర్ విద్యార్థులపై కూడా బలప్రయోగం జరిగిందని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులపై ఈ స్థాయిలో అణచివేత చర్యలకు పాల్పడటం తీవ్రంగా ఖండించాల్సిన విషయమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ ఘటన జరిగి రోజులు గడుస్తున్నప్పటికీ కేంద్ర హోం మంత్రి అమిత్ షా పార్లమెంట్కు హాజరై దీనిపై వివరణ ఇవ్వకపోవడాన్ని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. ఈ అంశంపై పార్లమెంట్లో చర్చించాలని విపక్షాలు ఇస్తున్న నోటీసులను తిరస్కరించడం ద్వారా హింసను ఆమోదించినట్లేనని ఆయన వ్యాఖ్యానించారు.
విద్యార్థులపై జరిగిన దాడులకు కేంద్ర హోం మంత్రి బాధ్యత వహించాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ఈ వ్యవహారాన్ని నియంత్రించలేకపోతే అది హోం శాఖ వైఫల్యమే అవుతుందని విమర్శించారు. విద్యార్థులపై జరిగిన దౌర్జన్యంపై ప్రభుత్వం, కేంద్ర హోం శాఖ సమాధానం చెప్పే వరకు తమ పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.
