
D News: Aug 10: రాజమహేంద్రవరంలో వైద్య విద్యార్థిని (మెడికో) ప్రియాంకపై కారుతో దాడి చేసిన ఘటనపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత తీవ్రంగా స్పందించారు. ఈ దారుణానికి పాల్పడిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని, దోషులకు చట్టప్రకారం శిక్ష పడేలా చూస్తామని ఆమె స్పష్టం చేశారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
ఈ ఘటనకు సంబంధించి జిల్లా ఎస్పీతో హోంమంత్రి అనిత ఫోన్లో మాట్లాడారు. కేసు దర్యాప్తు పురోగతి, కేసు నమోదైన తీరు, తదుపరి తీసుకోవాల్సిన చట్టపరమైన చర్యలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిందితులపై కఠినమైన సెక్షన్ల కింద చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు.
అనంతరం బాధితురాలు ప్రియాంక తండ్రి వెంకటేశ్తో మంత్రి అనిత ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయనకు ధైర్యం చెప్పిన మంత్రి.. ప్రభుత్వం నుంచి కుటుంబానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఘటనపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని భరోసా కల్పించారు.
ఘటన జరిగిన వెంటనే పోలీసులు వేగంగా స్పందించారని మంత్రి తెలిపారు. నిందితులను ఇప్పటికే అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు పేర్కొన్నారు. కేసు దర్యాప్తును మరింత వేగవంతం చేసి, బాధితురాలికి, ఆమె కుటుంబానికి త్వరలోనే పూర్తి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హోంమంత్రి అనిత పునరుద్ఘాటించారు.
