
D News: Aug 6: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ తన సొంత నియోజకవర్గం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. పిఠాపురాన్ని దేశంలోనే ఆదర్శవంతమైన (మోడల్) నియోజకవర్గంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు అనుగుణంగా గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాల వరకు రోడ్ల మౌలిక వసతుల అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు.
ఈ క్రమంలో దాదాపు రూ.200 కోట్ల అంచనా వ్యయంతో నియోజకవర్గ వ్యాప్తంగా రహదారుల నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, సాస్కీ, ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ శాఖల నిధులను సమన్వయం చేస్తూ మొత్తం 307 కిలోమీటర్ల మేర కొత్త రోడ్ల నిర్మాణాన్ని చేపట్టారు.
ఇప్పటికే సుమారు రూ.100 కోట్ల వ్యయంతో 152 కిలోమీటర్ల పరిధిలోని 611 రహదారుల నిర్మాణ పనులు పూర్తయ్యాయి. అదనంగా మరో 70 రోడ్ల పనులు ప్రస్తుతం వివిధ దశల్లో కొనసాగుతున్నాయి. దీంతో నియోజకవర్గంలో దాదాపు 80 శాతం కొత్త రోడ్ల నిర్మాణం పూర్తయినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ అభివృద్ధి పనుల వల్ల గ్రామాలు, పట్టణాల్లో ప్రయాణ సౌకర్యాలు మెరుగుపడి, ప్రజలకు రవాణా ఇబ్బందులు గణనీయంగా తగ్గాయి.
ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న పలు సమస్యలకు కూడా పవన్ కల్యాణ్ ప్రత్యేక చొరవతో శాశ్వత పరిష్కారాలు లభిస్తున్నాయి. ఉప్పాడ తీరంలో అలల ఉద్ధృతి కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న మాయాపట్నం మత్స్యకారుల పునరావాస కాలనీలో రూ.1.52 కోట్ల వ్యయంతో సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేశారు. అలాగే కొత్తసూరాడపేట కాలనీకి రూ.93 లక్షలతో సిమెంట్ రహదారిని నిర్మించి ప్రధాన రహదారికి అనుసంధానం చేశారు.
తుపాన్ల ప్రభావంతో దెబ్బతిన్న యు.కొత్తపల్లి మండలంలోని అమరవిల్లి–రామన్నపాలెం బీచ్ రోడ్డును రూ.88 లక్షలతో పునర్నిర్మించారు. ఎస్ఈజెడ్ పరిధిలోని ముమ్మడివారిపాడుకు రూ.79.70 లక్షలతో శాశ్వత రహదారిని నిర్మించగా, కొత్తపల్లిలో శ్మశానవాటికకు వెళ్లే మార్గాన్ని రూ.26.30 లక్షలతో అభివృద్ధి చేశారు. ఈ పనుల ద్వారా వేలాది మంది స్థానిక ప్రజలకు ప్రయోజనం చేకూరింది.
అదేవిధంగా కొండెవరం పరిధిలోని పిఠాపురం–ఉప్పాడ ఆర్అండ్బీ రోడ్డును రూ.1.22 కోట్ల వ్యయంతో యుద్ధప్రాతిపదికన పూర్తి చేశారు. ఈ రహదారి అందుబాటులోకి రావడంతో విద్యార్థులు, రైతులు, వ్యాపారులు సహా వేలాది మంది ప్రజల ప్రయాణ కష్టాలు తొలగిపోయి రవాణా సౌకర్యాలు మరింత మెరుగుపడ్డాయి.
