
D News: Aug 1: భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం భూములు త్యాగం చేసిన రైతులకు ప్రత్యేక గౌరవం కల్పిస్తోంది. ఈ ప్రాజెక్టు కోసం స్వచ్ఛందంగా భూములు ఇచ్చిన రైతులను ప్రత్యేక అతిథులుగా ఆహ్వానించడమే కాకుండా, ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనే బహిరంగ సభలో వారికి వీవీఐపీ (VVIP) గ్యాలరీలో ప్రత్యేక ఆసనాలు కేటాయించనుంది.
భోగాపురం మండలంలోని గూడెపువలస, రావాడ, కంచేరు, కవులువాడ, ఎ. రావివలస, సవరవిల్లి, ముంజేరు గ్రామాలకు చెందిన రైతులు విమానాశ్రయ నిర్మాణం కోసం తమ భూములను అందించారు. ఈ ప్రాజెక్టు కోసం సుమారు 403 మంది రైతులు భూములు ఇవ్వగా, 1,600 మంది వరకు ఇళ్లను అప్పగించినట్లు అధికారులు తెలిపారు. భూములు, ఇళ్లు రెండింటినీ ఇచ్చిన వారు 200 మందికి పైగా ఉన్నట్లు అంచనా.
భూములు త్యాగం చేసిన రైతులకు ప్రత్యేక గుర్తింపుగా జీవితంలో ఒక్కసారి ఉచిత విమాన ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో భాగంగా రైతులను విమానంలో హైదరాబాద్కు తీసుకెళ్లి, శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణానికి ముందు, తర్వాత ఆ ప్రాంతంలో జరిగిన అభివృద్ధిని ప్రత్యక్షంగా చూపించనున్నారు. విమానాశ్రయం అభివృద్ధి వల్ల స్థానిక ప్రాంతాలపై ఎలాంటి ప్రభావం ఉంటుందో వారికి వివరించనున్నారు.
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల కలగా భావిస్తున్న ప్రాజెక్టు. ఈ నిర్మాణంలో రైతులు అందించిన సహకారం, చేసిన త్యాగాన్ని గుర్తిస్తూ మొత్తం 1,600 మంది రైతులను ప్రభుత్వం ఘనంగా సత్కరించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. రైతుల సహకారం వల్లే ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు సాకారమైందని పేర్కొంటూ, వారి సేవలను చిరస్మరణీయంగా నిలిపేలా ఈ గౌరవ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు.
