
D News: Jul 21: భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందానికి వ్యతిరేకంగా రైతుల మహాపంచాయత్
భారత్–అమెరికా మధ్య ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందాన్ని (ట్రేడ్ డీల్) వ్యతిరేకిస్తూ దేశ రాజధాని ఢిల్లీలో నేడు భారీ రైతు ఆందోళనకు వేదిక సిద్ధమైంది. ‘దేశ్ బచావో మోర్చా’ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ మహాపంచాయత్లో పాల్గొనేందుకు దేశవ్యాప్తంగా సుమారు 550కి పైగా రైతు సంఘాలుతో పాటు పలు సామాజిక సంస్థలు ఏకమయ్యాయి. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి వేలాది మంది రైతులు ఢిల్లీలోని కిసాన్ ఘాట్ వైపు భారీగా తరలివస్తున్నారు.
ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందం అమల్లోకి వస్తే విదేశీ ఉత్పత్తుల దిగుమతులు పెరిగి, దేశంలోని చిన్న, సన్నకారు రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని రైతు సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అలాగే స్థానిక వ్యాపారులపై కూడా ఈ ఒప్పందం ప్రతికూల ప్రభావం చూపుతుందని, వారి జీవనోపాధి సంక్షోభంలో పడే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. దేశీయ వ్యవసాయ రంగాన్ని దెబ్బతీసే ఈ ఒప్పందాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని రైతు నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
ఢిల్లీలో కట్టుదిట్టమైన భద్రత
రైతులు భారీ సంఖ్యలో ఢిల్లీకి చేరుకుంటున్న నేపథ్యంలో రాజధానిలోని సరిహద్దు ప్రాంతాలు, కిసాన్ ఘాట్ పరిసరాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఢిల్లీ పోలీసులు, కేంద్రీయ భద్రతా బలగాలు పెద్ద ఎత్తున మోహరించి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాయి. భారీ రద్దీని దృష్టిలో ఉంచుకుని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
ప్రజాస్వామ్యబద్ధంగా తమ నిరసనను వ్యక్తం చేసేందుకు వచ్చిన రైతులను అడ్డుకుంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని రైతు సంఘాల నాయకులు హెచ్చరించారు. శాంతియుతంగా మహాపంచాయత్ నిర్వహించి తమ డిమాండ్లను కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని వారు స్పష్టం చేశారు.
