
D News: Jul 21: తెలంగాణలో మళ్లీ జోరందుకున్న వర్షాలు
తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు మళ్లీ జోరందుకున్నాయి. గత రాత్రి ఉత్తర, తూర్పు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిశాయి. మంచిర్యాల జిల్లా కన్నెపల్లిలో అత్యధికంగా 124 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే పెద్దపల్లి జిల్లా కమాన్పూర్లో 95 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ సీజన్లో ఇప్పటివరకు నమోదు కాని స్థాయిలో వర్షాలు కురవడంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.
గత రెండు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, కరీంనగర్, కుమురంభీం ఆసిఫాబాద్, జగిత్యాల జిల్లాల్లో రాత్రి వేళల్లో కుండపోత వర్షం కురిసింది. చాలా రోజుల తర్వాత రాష్ట్రంలో వర్షాకాలం అసలైన అనుభూతి కలుగుతుండటంతో ప్రజలు కూడా ఈ ఆహ్లాదకర వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు.
రానున్న 24 గంటల్లో భారీ వర్షాల సూచన
హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు రానున్న 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. రోజంతా ముసురు వాతావరణం కొనసాగే అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు. రాబోయే మూడు గంటల్లో సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు.
అదేవిధంగా మెదక్, సిద్దిపేట, కరీంనగర్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల్లో తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మహబూబ్నగర్, నారాయణపేట, జనగామ, హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లో కూడా అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ప్రజలకు అధికారుల హెచ్చరికలు
భారీ వర్షాల నేపథ్యంలో వాగులు, వంకలు దాటే సమయంలో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం హెచ్చరించింది. అత్యవసర పరిస్థితులు మినహా బయటకు రావద్దని, ప్రయాణాల సమయంలో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
హైదరాబాద్లో ముసురు వాతావరణం
హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం ముసురు వాతావరణం కొనసాగుతోంది. మధ్యాహ్నం లేదా సాయంత్రం నుంచి రాత్రి వరకు నగరంలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు తెలిపారు. రోడ్లపై నీరు నిలిచే అవకాశం ఉన్నందున వాహనదారులు, ప్రయాణికులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
సోమవారం సాయంత్రం నుంచి నగరంలో వర్షం కురుస్తూనే ఉంది. అత్యధికంగా మహేశ్వరంలో 34.3 మిల్లీమీటర్లు, బాలాపూర్లో 38 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైంది. షేక్పేట్, హఫీజ్పేట్, మాదాపూర్ ప్రాంతాల్లో కూడా గణనీయమైన వర్షపాతం నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.
ముందస్తు చర్యలు
భారీ వర్షాల నేపథ్యంలో నగరంలోని ప్రధాన రహదారులపై ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్వ కాకుండా మున్సిపల్ సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
