
DNews: Feb 24: మావోయిస్టు ఉద్యమానికి దశాబ్దాల పాటు నాయకత్వం వహించిన గణపతి అలియాస్ ముప్పల్ల లక్ష్మణరావు ప్రస్తుతం నేపాల్లో ఉన్నారని సమాచారం వెలువడింది. ఆయన తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతూ నడవలేని స్థితిలో ఉన్నారని చెబుతున్నారు. తెలంగాణ పోలీసులు ఆయనను భారత్కు తీసుకురావడానికి ప్రయత్నాలు వేగవంతం చేస్తున్నారు. వయసు కారణంగా గణపతి ఇప్పటికే మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తప్పుకున్నారు.
ఇక మరోవైపు, హైదరాబాద్లో నాలుగు కీలక మావోయిస్టులు పోలీసుల ముందు లొంగిపోనున్నారు. వీరిలో మావోయిస్టు సెంట్రల్ కమిటీ కార్యదర్శి దేవ్జీ అలియాస్ తిప్పిరి తిరుపతి, రాష్ట్ర కార్యదర్శి బాడే చొక్కారావు, సెంట్రల్ కమిటీ సభ్యుడు మల్లా రాజిరెడ్డి, నున్నే నరసింహారెడ్డి ఉన్నారు. ఇటీవల అసిఫాబాద్ అటవీ ప్రాంతంలో దేవ్జీ, మల్లా రాజిరెడ్డి లు SIB ముందు లొంగిపోయిన విషయం తెలిసిందే.
ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం ప్రకారం దేవ్జీతో పాటు పలువురు మావోయిస్టు నాయకులు మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్గఢ్-తెలంగాణ సరిహద్దులోని కర్రెగుట్ట ప్రాంతానికి చేరుకున్నారని తెలుస్తోంది. దీనితో భద్రతా బలగాలు ఆ ప్రాంతంలో కాంబింగ్ ఆపరేషన్ నిర్వహించాయి. ఈ సందర్భంగా జరిగిన ఎన్కౌంటర్లో పలువురు మావోయిస్టులు మృతి చెందారు.
కేంద్ర ప్రభుత్వం 2026 మార్చి 31 నాటికి దేశంలో మావోయిస్టులను పూర్తిగా నిర్మూలించాలనే లక్ష్యాన్ని పెట్టుకుంది. ఈ దిశగా వ్యూహాత్మక చర్యలు తీసుకుంటూ మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల్లో నిరంతర కాంబింగ్ ఆపరేషన్లు కొనసాగిస్తోంది. వందలాది మావోయిస్టులు ఎన్కౌంటర్లలో మృతి చెందగా, వేలాది మంది లొంగిపోయారు. అనేక మంది అరెస్టు అయ్యారు.
ఇప్పటికే పలువురు అగ్రనేతలు ఎన్కౌంటర్లలో హతమయ్యారు. అయితే గణపతి అలియాస్ ముప్పల్ల లక్ష్మణరావు పోలీసుల చెరలోకి వస్తే, మావోయిస్టు పార్టీ చరిత్రలో మిగిలిపోతుందనే చర్చ జరుగుతోంది.
