
D Spiritual: Feb 6: వైసీపీ పాలనలో అనేక వివాదాస్పద ఘటనలు చోటుచేసుకున్నాయని జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారంపై కూటమి నేతలు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
“సాధారణంగా వ్యక్తిగతంగా వర్గాలపై కక్షలు ఉంటాయి. కానీ వైసీపీ వాళ్లు భగవంతుడిపైనా పగపెట్టుకున్నారు. ఏ నివేదికలోనూ క్లీన్చిట్ ఇవ్వలేదనేది వాస్తవం,” అని పవన్ వ్యాఖ్యానించారు. సున్నితమైన అంశాలపై ఆలోచించి మాట్లాడాలని కూడా ఆయన సూచించారు.
ఈ వ్యవహారంలో దోషులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. భగవంతుడి ముందు వారు మోకరిల్లే వరకు తమ పోరాటం ఆగదని హెచ్చరించారు. నెయ్యి పేరుతో పామాయిల్, ప్రమాదకరమైన రసాయనాలు వాడి భక్తుల మనోభావాలను, ఆరోగ్యాన్ని దెబ్బతీశారని తీవ్రంగా విమర్శించారు.
ఈ అంశంపై మాట్లాడేటప్పుడు తాము అన్ని పరిణామాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని పవన్ తెలిపారు. ఈ వ్యవహారాన్ని ప్రజల దృష్టికి తీసుకురావడం తన బాధ్యత అని స్పష్టం చేశారు. ఇవాళ ఉండవల్లిలో కూటమి నేతల సమావేశం అనంతరం నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
