
D Spiritual: Jan 31: కోట్లాది మంది భక్తుల విశ్వాసాలకు ప్రతీకగా నిలిచే మేడారం మహాజాతర నేటితో ఘనంగా ముగియనుంది. ఈ నెల 28న ప్రారంభమైన మేడారం మహాజాతరకు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. బుధవారం కన్నెపల్లి నుంచి సారలమ్మ, మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజు, ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం కొండాయి నుంచి గోవిందరాజు గద్దెలపైకి చేరారు.
29వ తేదీన చిలుకలగుట్ట నుంచి సమ్మక్కతల్లిని ప్రధాన గద్దెపై ప్రతిష్టించారు. దీంతో మేడారం అరణ్యం భక్తుల జయజయధ్వానాలతో మార్మోగింది. రెండేళ్ల తర్వాత ఈ మహాజాతర జరగడంతో భక్తుల్లో ప్రత్యేక ఉత్సాహం కనిపించింది.
శుక్రవారం సమ్మక్క సారలమ్మతో పాటు పగిడిద్దరాజు, గోవిందరాజు భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఇద్దరు తల్లులు గద్దెలపై కొలువుదీరి దర్శనం ఇవ్వడంతో భక్తులు ఒక్కొక్కరుగా గూడారాలు ఖాళీ చేసి స్వస్థలాలకు బయలుదేరారు.
శనివారం నలుగురు దేవతలు తిరిగి వనంలోకి చేరడంతో జాతర అధికారికంగా ముగియనుంది. జాతరకు నిన్నటి వరకు మొత్తం సుమారు 1.50 కోట్ల మంది భక్తులు హాజరైనట్లు అధికారిక అంచనాలు వెల్లడించాయి.
మరో రెండేళ్ల తర్వాత ఈ మహాజాతర తిరిగి జరగనుండగా, అప్పటివరకు సమ్మక్క–సారలమ్మల కృపతో భక్తుల జీవితాల్లో శాంతి, సుఖసంతోషాలు వెల్లివిరియాలని భక్తులు ఆకాంక్షిస్తున్నారు.
