
DNews: Dec 11: గరిడేపల్లి వార్తలు: పట్టుదలతో ఉంటే ఏదీ అసాధ్యం కాదని యువత నిరూపిస్తున్నారు. ఒకవైపు ప్రైవేట్ ఉద్యోగం చేస్తూనే మరోవైపు ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధిస్తున్నారు. అటువంటి వారిలో గడ్డిపల్లి కేవీకేలో హార్టికల్చర్ విభాగంలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్న చమకూరి నరేష్ ఒకరు. మోటె మండలంలోని ఉర్లుగొండ గ్రామానికి చెందిన నరేష్ చిన్నప్పటి నుంచే తోటపంటలపై ఆసక్తి కలిగి ఉండేవారు. కూరగాయలు, తోటలు, పప్పుదినుసులు వంటి పంటల గురించి నేర్చుకునేవారు. 2013లో వైఎస్ఆర్ హార్టికల్చరల్ యూనివర్సిటీ నుండి బీఎస్సీ హార్టికల్చర్ పూర్తి చేసి, 2016లో ఎంఎస్సీ హార్టికల్చర్ చేశారు. అనంతరం ప్రైవేట్ పురుగుమందుల కంపెనీల్లో పనిచేశారు. ఆ అనుభవమే ఆయనను గడ్డిపల్లి కేవీకేలో శాస్త్రవేత్తగా ఎంపిక కావడానికి దోహదపడింది. రైతుల కోసం కొత్త రకాల కూరగాయల విత్తనాలను ఇతర రాష్ట్రాల నుండి తెచ్చి పరిచయం చేస్తున్నారు. షేడ్ నెట్లతో నాణ్యమైన నర్సరీలను పెంచుతున్నారు. అధిక దిగుబడి ఇచ్చే, పురుగులు మరియు వ్యాధులకు ప్రతిఘటన కలిగిన హైబ్రిడ్ రకాల పంటలను పరిచయం చేస్తున్నారు. ముఖ్యంగా ఆయకట్టు లేని ప్రాంతాల్లో పండ్ల తోటలు, కూరగాయల తోటలు సాగు చేసే రైతులను ప్రత్యక్షంగా సందర్శించి సూచనలు, సలహాలు ఇస్తున్నారు. యువతను తోటపనుల వైపు మళ్లించేందుకు శిక్షణ ఇస్తున్నారు. నిరుద్యోగ యువతకు తేనెటీగల పెంపకం, పూల నర్సరీలు, గ్రాఫ్టింగ్ పద్ధతులపై శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలను చూపిస్తున్నారు. ఆయన కృషికి గుర్తింపుగా ఉత్తమ శాస్త్రవేత్త అవార్డు అందుకున్నారు. కొత్త సాంకేతికతలు, కొత్త విత్తనాలను సేకరించి జిల్లా రైతులకు అందించడం ద్వారా తన వృత్తికి న్యాయం చేస్తున్నానని ఆయన చెబుతున్నారు.
