
DNews: Dec9: అమ్మేది లేదంటూనే అప్పనంగా అదానీ చేతిలో పెడుతున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ లేదని, అమ్మబోమని, ఆదుకుంటామని బీజేపీ చెప్పేవన్నీ కల్లబొల్లి కబుర్లే. తెరముందు గొప్పలు.. తెరవెనుక అదానీ కోసం స్కెచ్చులు.. విశాఖ స్టీల్ పై మోడీ గారిది ఆపరేషన్ సైలెంట్ కిల్లింగ్. ఉద్యోగులను తప్పిస్తున్నారు. కొత్త నియామకాలు లేకుండా అడ్డుకున్నారు. అడ్డికి పావుసేరు లెక్కన ప్లాంట్ భూములను అదానీకి ధారాదత్తం చేయాలని చూస్తున్నారు. ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కుకు ఉరి పెడుతున్నారు. ఒక్కొక్కటిగా అదానీకి అన్ని అప్పగిస్తూ రాష్ట్రాన్ని అదానీ ప్రదేశ్ గా మార్చాలని చూస్తున్నారు.
విశాఖ ఉక్కును అమ్మే కుట్రలో కర్త మోదీ గారైతే, క్రియ చంద్రబాబు గారు. ఒక చేత్తో సాయం అని చెప్పి మరో చేత్తో గుంజుకున్నారు. పొమ్మనలేకుండా పొగపెట్టిన చందాన నష్టాల సాకు చూపి ఉద్యోగులను వేధిస్తున్నారు. పనికొద్ది జీతమని ప్రపంచంలో లేని రూల్స్ ను పెడుతున్నారు. టెండర్ల పేరుతో ముక్కలుగా కోసి విడిభాగాలుగా అమ్మకానికి పెట్టి, ప్రతి అడుగూ ఆదానీకి దగ్గర చేస్తున్నారు. స్టీల్ ఉత్పత్తికి కావాల్సిన ముడి సరుకులను ఇవ్వకుండా ముప్పు తిప్పలు పెడుతున్నారు. ఇంత చేస్తూ స్టీల్ ప్లాంట్ పై చిత్తశుద్ధి ఉందని గొప్పలు చెప్పడానికి బీజేపీ కి సిగ్గుండాలి.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. విశాఖ స్టీల్ పై కేంద్రానికి చిత్తశుద్ధి ఉంటే , తెలుగు వారి ఆత్మగౌరవం మీద గౌరవముంటే అదానీకి కట్టబెట్టే ఆలోచనే లేకుంటే, వెంటనే ఈ పార్లమెంట్ సమావేశాల్లో ప్రధాని మోడీ నిలబడి ప్రకటన చేయాలి. స్టీల్ ప్లాంట్ ను అమ్మేది లేదని చెప్పాలి. విశాఖ స్టీల్ కి సొంతగా గనులను కేటాయించాలి. విశాఖ స్టీల్ ను SAIL లో విలీనం చేస్తున్నట్లు హామీ ఇవ్వాలి. రాష్ట్ర ఎంపీలకు దమ్ముంటే మోడీ గారితో ఈ ప్రకటన చేయించాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం అని ట్విట్టర్ (X) లో మండి పడ్డారు
