
DNews: Dec9: వచ్చే సంక్రాంతి నాటికి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ సేవలను ఆన్లైన్లో ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. సోమవారం RTGS (రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ)పై జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన ఈ మేరకు కీలక సూచనలు చేశారు. పారదర్శక పాలన అందించడం, ప్రభుత్వ పనితీరుపై ప్రజల సంతృప్తి స్థాయిని పెంచడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రజలు తిరగాల్సిన అవసరం లేకుండా అన్ని సేవలను అందించాలని సీఎం ఆదేశించారు. దీని కోసం ‘మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్’ను సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని, దీనిపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. కొన్ని శాఖలు ఇప్పటికీ భౌతికంగా సేవలు అందిస్తున్నాయని, అవి వెంటనే తమ పద్ధతులను మార్చుకుని ఆన్లైన్లోకి వెళ్లాలని చంద్రబాబు అన్నారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పలు శాఖలకు నిర్దిష్ట ఆదేశాలు జారీ చేశారు. రిజిస్ట్రేషన్ తర్వాత కొరియర్ ద్వారా నేరుగా లబ్ధిదారుల ఇళ్లకు పత్రాలను పంపాలని సూచించారు. ఆర్టీసీ బస్టాండ్లలో, ముఖ్యంగా టాయిలెట్ల వద్ద శుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించాలని ఆదేశించారు. భవిష్యత్తులో డ్రోన్ల వాడకం గణనీయంగా పెరుగుతుందని, వాటి సేవలను మరింత విస్తరించడానికి ఒక మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలని ఆయన అన్నారు. పురుగుమందుల వాడకాన్ని తగ్గించడానికి డ్రోన్లను ఎలా ఉపయోగించవచ్చో రైతులకు అవగాహన కల్పించాలి.
కొన్ని జిల్లాల్లో అధికారులు అమలు చేస్తున్న మంచి పద్ధతులను గుర్తించి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. ఈ సమావేశంలో ప్రధాన కార్యదర్శి విజయానంద్, ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
