
DNews: Dec 08: హైదరాబాద్: మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ పార్టీ రెండేళ్ల పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన, ముఖ్యమంత్రి ప్రజాదర్భార్లో ప్రతిరోజూ ప్రజలను కలుస్తానని చెప్పిన వాగ్దానం ఏమైందని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డిని “బిల్డప్ బాబా”గా అభివర్ణిస్తూ, ప్రజాభవన్ను జల్సాలు, విందులు, పెళ్లిళ్లు, CLP సమావేశాల కోసం వాడుతున్నారని ఆరోపించారు. ఇది “రేవంత్ రెడ్డి ప్రైవేట్ లిమిటెడ్” పాలన అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలు బాధ, వేదనలో మగ్గారని, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతిన్నదని విమర్శించారు. రెండేళ్లలో ఆదాయం ఎందుకు తగ్గిందో చూడాలని, ఈ పాలన రేవంత్ కుటుంబం మరియు మంత్రుల అవినీతి పాలన అని ఆరోపించారు. కాంగ్రెస్ నాయకత్వం ఈ అవినీతికి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ప్రజలందరినీ మోసం చేసిన పాలన ఇది అని, ప్రభుత్వానికి ఎలాంటి విజన్, పాలసీ లేవని అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు, అభివృద్ధి, సంక్షేమం నెరవేరలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయోత్సవాలు జరుపుకోవడం కాకుండా “అపజయోత్సవం” జరపాలని అన్నారు. బిల్లులు అడిగితే విజిలెన్స్ దర్యాప్తులు, ACB దాడులు చేస్తూ, ప్రశ్నించిన వారిని బ్లాక్మెయిల్ చేస్తున్నారని ఆరోపించారు. ఒక్క గ్రామంలోనైనా రుణమాఫీ పూర్తిగా జరగలేదని, జరిగితే తాను రాజీనామా చేయడానికి సిద్ధమని సవాలు విసిరారు. రైతులను సంకెళ్లతో కట్టేసిన ప్రభుత్వం ఇదని, కాంగ్రెస్ రైతు సంక్షోభ ప్రభుత్వమని అన్నారు. ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకుండా మద్యం షాపులకు నోటిఫికేషన్లు ఇస్తున్నారని, రేవంత్ రెడ్డి “మద్యపాన తెలంగాణ” వైపు అడుగులు వేస్తున్నారని మండిపడ్డారు. పెద్ద కాంట్రాక్టర్ల బిల్లులు మాత్రం ఎన్నికలు ఏవైనా క్లియర్ అవుతున్నాయని హరీష్ రావు విమర్శించారు.
