
DNews: Dec8: గోవాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఉత్తర గోవాలోని అర్పోరా గ్రామంలోని ఒక నైట్క్లబ్లో శనివారం రాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో కనీసం 25 మంది మృతి చెందారు. వంటగదిలో సిలిండర్ పేలిన తర్వాత మంటలు వేగంగా వ్యాపించాయని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు.
రాజధాని పనాజీకి 25 కి.మీ దూరంలో ఉన్న ‘బిర్చ్ బై రోమియో లేన్’ అనే నైట్క్లబ్లో మంటలు చెలరేగాయి. మృతుల్లో నలుగురు పర్యాటకులు, మిగిలిన వారు క్లబ్ సిబ్బంది అని ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ తెలిపారు. మృతుల్లో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారని పోలీసులు తెలిపారు. మంటల్లో ముగ్గురు సజీవ దహనం కాగా, 20 మంది పొగ పీల్చడం వల్ల మరణించారు.
ప్రమాద వార్త అందిన వెంటనే, ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, స్థానిక ఎమ్మెల్యే మైఖేల్ లోబో సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఈ విషాదం పట్ల సీఎం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సంఘటనపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించినట్లు ఆయన ప్రకటించారు. క్లబ్లో భద్రతా ప్రమాణాలు పాటించలేదని, దర్యాప్తులో నిర్లక్ష్యం బయటపడితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని మొదట్లో వార్తలు వచ్చాయి. అనుమతులు ఇచ్చిన అధికారులను వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు.
ఈ ప్రాంతంలోని అన్ని నైట్క్లబ్లలో తనిఖీలు నిర్వహిస్తామని, అనుమతులు లేని వాటి లైసెన్స్లను రద్దు చేస్తామని ఎమ్మెల్యే మైఖేల్ లోబో అన్నారు. మృతదేహాలను పోస్ట్మార్టం కోసం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గత సంవత్సరం ప్రారంభమైన ఈ క్లబ్లో ఇంత పెద్ద ప్రమాదం జరగడం స్థానికంగా సంచలనం సృష్టించింది.
