
DNews: Dec 08: హైదరాబాద్ నగరంలో చలి తీవ్రత పెరుగుతోంది. నగరం మొత్తం చలితో వణికిపోతోంది. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్కి పడిపోయాయి. వాతావరణ శాఖ ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా తీవ్రమైన చలి గాలులు వీస్తాయని, ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గుతాయని హెచ్చరించింది. ముఖ్యంగా ఉదయం వేళల్లో చలి తీవ్రత ఎక్కువగా నమోదవుతుందని పేర్కొంది. శాస్త్రవేత్తలు చెబుతున్న ప్రకారం గాలిలో తేమ పెరగడం, వాతావరణ మార్పులు జరగడం వల్ల చలి తీవ్రత మరింత పెరిగింది. సాధారణంగా జనవరిలోనే చలి ఎక్కువగా ఉంటుంది. అయితే ఈసారి డిసెంబర్లోనే కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. సిరిలింగంపల్లి 9 డిగ్రీలు, రాజేంద్రనగర్ 10.7, గచ్చిబౌలి 11, శివరంపల్లి 12.4, తిత్తియన్నారం 12.4, మచ్చ బొల్లారం 13.1, ఆల్వాల్ 13.2, జీడిమెట్ల 13.3, కుత్బుల్లాపూర్ 13.4, కూకట్పల్లి 13.5, బేగంపేట్ 13.6, లింగంపల్లి 14.2, మాధాపూర్ 14.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ తీవ్ర చలిలో వృద్ధులు, చిన్నపిల్లలు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. చలి కారణంగా వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. స్వెటర్లు, మఫ్లర్లు ధరించాలని, అత్యవసర పరిస్థితులు తప్ప ఉదయం, రాత్రి బయటకు వెళ్లకూడదని సూచిస్తున్నారు. చల్లని ఆహారాన్ని మానుకుని వేడి ఆహారం మాత్రమే తీసుకోవాలని ప్రజలకు వైద్యులు సలహా ఇస్తున్నారు.
