
DNews: Dec 06: జాతీయ రహదారి 44 తెలంగాణ–మహారాష్ట్రలను కలుపుతూ ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గాల గుండా సాగుతుంది. ఈ రహదారి నర్మల్ జిల్లా నుంచి ఆదిలాబాద్ జిల్లా జైనాథ్ మండలంలోని పెంగంగ వరకు సుమారు 75 కిలోమీటర్ల పొడవున విస్తరించి ఉంది. ఈ మార్గంలో వంకరలు, ఎత్తైన రహదారులు, సూచికల కొరత, డ్రైవర్ల నిర్లక్ష్యం కారణంగా తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా బోథ్ ఎక్స్రోడ్, బోరిగాం ప్రాంతాల్లో రాత్రివేళ వాహనాలు అధిక వేగంతో ప్రయాణించడం వల్ల నియంత్రణ కోల్పోతున్నాయి. నేరడిగొండ మండలంలోని కుప్టి వంతెన వద్ద పరిస్థితి మరింత ప్రమాదకరంగా ఉంది. ఇక్కడ ఇచ్ఛోడ వైపు నుంచి వచ్చే వాహనాలు ఎత్తు నుంచి దిగుతూ వంతెనపైకి చేరుతుండగా నియంత్రణ తప్పి వంతెనపై నుంచి పడిపోతున్నాయి. వేగాన్ని తగ్గించేందుకు రబ్బరు స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయడం అత్యవసరం.

ఇటీవల రహదారి మరమ్మతుల కారణంగా ఒకే వైపు వాహనాలను రెండు దిశల్లో నడిపిస్తున్నారు. దీంతో రాత్రివేళల్లో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ సమయంలో రేడియం సూచికలు ఏర్పాటు చేయడం అత్యవసరం. నిద్రలేమి కారణంగా డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో హైదరాబాద్ నుంచి గోరఖ్పూర్ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, ముందున్న లారీని ఢీకొని డ్రైవర్తో పాటు నలుగురు సంవత్సరాల బాలుడు మృతి చెందిన ఘటన బోథ్ ఎక్స్రోడ్ వద్ద చోటుచేసుకుంది.
ఈ రహదారిపై ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలు: నేరడిగొండ మండలంలోని వంకిడి ఎక్స్రోడ్, రోల్మమడలోని యూ-టర్న్, కుంటాల జలపాతం వైపు వెళ్లే రహదారి, కుప్టి వంతెన, గుడిహత్నూర్ మండలంలోని సీతగొండి, మేకలగండి, భోరాజ్ చెక్పోస్టులు. మరమ్మతుల సమయంలో ఒకే వైపు వాహనాలను రెండు దిశల్లో నడపడం వల్ల రాత్రివేళల్లో డ్రైవర్లు ఎంత జాగ్రత్తగా ఉన్నా ప్రమాదాలు తప్పడం లేదు. అందువల్ల రేడియం సూచికలు, స్పీడ్ బ్రేకర్లు వంటి భద్రతా చర్యలు అత్యవసరంగా అమలు చేయాల్సిన అవసరం ఉంది.
