
DNews: Dec 03: తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా బుధవారం పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీని పార్లమెంట్లో కలుసుకున్నారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లూ భట్టి విక్రమార్కతో పాటు పలువురు నేతలు కూడా ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, హైదరాబాద్లోని భారత్ ఫ్యూచర్ సిటీలో అంతర్జాతీయ స్థాయిలో జరగబోయే తెలంగాణ రైజింగ్-2047 గ్లోబల్ సమ్మిట్ కు ప్రధానమంత్రిని ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రత్యేకంగా ముద్రించిన ఆహ్వాన పత్రాన్ని ప్రధానికి అందజేశారు. తెలంగాణ భవిష్యత్ దిశగా ముందుకు సాగుతూ, కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన వికసిత్ భారత్-2047 లక్ష్యాలకు అనుగుణంగా రాష్ట్రం $3 ట్రిలియన్ ఆర్థిక వృద్ధి లక్ష్యాన్ని సాధించేందుకు కృషి చేస్తోందని వివరించారు. ఈ క్రమంలో అన్ని రంగాల అభివృద్ధి లక్ష్యాలు, భవిష్యత్ ప్రణాళికలను విశ్లేషిస్తూ తెలంగాణ రైజింగ్-2047 విజన్ డాక్యుమెంట్ సిద్ధం చేసినట్లు తెలిపారు. నితి ఆయోగ్ సూచనలు, నిపుణుల ఆలోచనలతో రూపొందించిన ఈ విజన్ డాక్యుమెంట్ను గ్లోబల్ సమ్మిట్లో ఆవిష్కరించనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానికి వివరించారు.
