
DSports 03 Dec:హైదరాబాద్: భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు. క్రికెట్లో తన అద్భుతమైన ప్రదర్శన, నాయకత్వంతో ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచిన హర్మన్ప్రీత్కు రాజస్థాన్లోని ప్రముఖ జైపూర్ వ్యాక్స్ మ్యూజియం (నహర్గఢ్ కోట)లో మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ ఘనత సాధించిన తొలి మహిళా క్రికెటర్గా హర్మన్ప్రీత్ కౌర్ రికార్డు సృష్టించారు.
ఇటీవల హర్మన్ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత మహిళా జట్టు తొలిసారిగా ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్-2025 టైటిల్ను గెలుచుకుంది. ఈ చారిత్రక విజయాన్ని శాశ్వతం చేసేందుకు మ్యూజియం నిర్వాహకులు ఈ నిర్ణయం తీసుకున్నారు. జైపూర్ వ్యాక్స్ మ్యూజియం వ్యవస్థాపకుడు, డైరెక్టర్ అనూప్ శ్రీవాస్తవ ఈ విషయాన్ని ప్రకటించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8, 2026 న ఈ విగ్రహాన్ని ఆవిష్కరించే అవకాశం ఉంది. ప్రపంచ కప్ విజయం సందర్భంలో ఉన్న హర్మన్ప్రీత్ రూపాన్ని, ఆమె ఆత్మవిశ్వాసాన్ని ప్రతిబింబించేలా విగ్రహాన్ని రూపొందిస్తున్నారు. విగ్రహ తయారీ కోసం మ్యూజియం బృందం ఇటీవల హర్మన్ప్రీత్ను కలిసి ఆమె శరీర కొలతలు తీసుకున్నారు.
జైపూర్ మైనపు మ్యూజియంలో ఇప్పటికే క్రికెట్ దిగ్గజాలైన సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, ఎం.ఎస్. ధోని వంటి క్రీడా ప్రముఖుల విగ్రహాలు ఉన్నాయి.హర్మన్ప్రీత్ కౌర్ విగ్రహం ఏర్పాటుతో, ఒకే మ్యూజియంలో భారత్కు వన్డే ప్రపంచకప్ అందించిన ఇద్దరు కెప్టెన్లు – ఎం.ఎస్. ధోని (పురుషుల జట్టు), హర్మన్ప్రీత్ కౌర్ (మహిళల జట్టు) విగ్రహాలు ఉండటం విశేషం.ఈ విగ్రహం దేశంలోని యువతులకు, క్రీడాకారిణులకు గొప్ప స్ఫూర్తిగా నిలుస్తుందని మ్యూజియం నిర్వాహకులు తెలిపారు.
ఈ అరుదైన గౌరవంపై హర్మన్ప్రీత్ కౌర్ ఆనందం వ్యక్తం చేస్తూ, ఈ నిర్ణయం దేశం కోసం మరింత బాగా పనిచేయడానికి తనను ప్రోత్సహిస్తుందని తెలిపారు.
