
DNews : Dec 02: వెల్డండ గ్రామీణం: నాగర్కర్నూల్ జిల్లా వెల్డండ మండలంలోని రగైపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికను ఏకగ్రీవంగా నిర్వహించాలన్న ప్రయత్నం విఫలమైంది. ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా సర్పంచ్ పదవికి ఎనిమిది నామినేషన్లు దాఖలయ్యాయి. ఈ నేపథ్యంలో గ్రామస్థులు సోమవారం రగైపల్లి సమీపంలో ప్రత్యేక సమావేశం నిర్వహించి ఓపెన్ వేలం చేపట్టారు. అందులో సామ వెంకటయ్య గ్రామ సమస్యలను పరిష్కరించేందుకు రూ.25 లక్షలు ఇవ్వడానికి అంగీకరించారు. ఆ సమయంలో ఆరుగురు సర్పంచ్ అభ్యర్థులు ఏకగ్రీవానికి అంగీకారం తెలిపినా, గణేష్ అనే అభ్యర్థి సంతకం చేయకుండా వెళ్లిపోయాడు. అనంతరం గణేష్ సోషల్ మీడియాలో తనను బెదిరించి ఏకగ్రీవానికి ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నారని పోస్టు చేశాడు. దీనిపై జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు మంగళవారం పోలీసులు గ్రామానికి వెళ్లి స్థానికులతో మాట్లాడి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం గణేష్ కోసం పోలీసులు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.
