
DNews : Dec 02: హైదరాబాద్లో జరగబోయే ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’ సందర్భంగా పలు కీలక ఒప్పందాలు కుదరనున్నాయి. బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ భరత్ ఫ్యూచర్ సిటీలో ప్రపంచ స్థాయి ఫిల్మ్ సిటీని ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం (MoU) కుదురనుంది. ఇప్పటికే మరో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్కు కూడా భూమి కేటాయింపు నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఫ్యూచర్ సిటీలో రెండవ ఫిల్మ్ సిటీ ఏర్పాటవుతోంది. తెలంగాణ రైజింగ్ విజన్లో భాగంగా వినోదం, పర్యాటక రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించి, 2047 నాటికి రాష్ట్రాన్ని 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం.

ఈ గ్లోబల్ సమ్మిట్కు దేశ, విదేశాల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఈ వేదికలో అజయ్ దేవగన్ ఫిల్మ్ సిటీ ఒప్పందం కుదురుతుండగా, రిలయన్స్ గ్రూప్ కూడా తెలంగాణలో పెట్టుబడులకు ఆసక్తి చూపుతోంది. రిలయన్స్ వంతర ప్రాజెక్ట్ ద్వారా జంతు రక్షణ, పునరావాస కేంద్రం, వైల్డ్లైఫ్ కన్జర్వేటరీ, నైట్ సఫారీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఫ్యూచర్ సిటీలో ఇప్పటికే 15,000 ఎకరాలు అటవీ ప్రాంతంగా కేటాయించబడినందున అక్కడ వంతర ఏర్పాటు చేసే అవకాశం ఉంది. అది సాధ్యం కాకపోతే మహబూబ్నగర్ జిల్లాలో ఏర్పాటు చేసే అవకాశముందని ప్రభుత్వం తెలిపింది. గుజరాత్లో ఇప్పటికే వంతర సాంక్చువరీ ఏర్పడి ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకుంది.
అదనంగా, దేశవ్యాప్తంగా లగ్జరీ కేటరింగ్ సేవలు అందిస్తున్న ‘ఫుడ్ లింక్ F&B హోల్డింగ్స్’ సంస్థ, ఫ్యూచర్ సిటీలో రూ. 3,000 కోట్లతో మూడు స్టార్ హోటళ్లను నిర్మించేందుకు ఒప్పందం కుదురుస్తోంది. ఈ అన్ని ఒప్పందాలు ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’ వేదికపైనే కుదరనున్నాయి.
