
DNews: Nov 28: హైదరాబాద్లో ఈగిల్ టీమ్ తెలంగాణ, ఎన్సీబీ మరియు ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్లో మాదకద్రవ్యాలను సరఫరా చేస్తున్న నైజీరియన్ గ్యాంగ్ను అరెస్టు చేశారు. ఈ కేసులో అనేక సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. జాతీయ రాజధాని ఢిల్లీలోని 20 ప్రాంతాల్లో వీసా గడువు ముగిసిన 50 మందికి పైగా నైజీరియన్లను గుర్తించి అరెస్టు చేశారు. ముఖ్య నిందితులను నోయిడా, గ్వాలియర్, విశాఖపట్నం వంటి నగరాల్లో పట్టుకున్నారు. ఈ ఆపరేషన్లో 5,340 ఎక్స్-సిటీ టాబ్లెట్లు, 250 గ్రాముల కోకైన్, 109 గ్రాముల హెరాయిన్, 250 గ్రాముల మెతాంఫెటమైన్ను నాలుగు ప్రాంతాల్లో స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీలో 59 మ్యూల్ అకౌంట్లు, 16 డ్రగ్ సెంటర్లను గుర్తించారు. నైజీరియాకు చెందిన 107 బ్యాంక్ ఖాతాలను ఫ్రీజ్ చేశారు. మల్నాద్ రెస్టారెంట్, మహీంద్రా యూనివర్సిటీ కేసుల్లో నైజీరియన్ నిక్ను అరెస్టు చేశారు. దేశవ్యాప్తంగా ఈ గ్యాంగ్కు చెందిన 2,000 మందికి పైగా డ్రగ్ వినియోగదారులు, పేడ్లర్లను ఈగిల్ టీమ్ గుర్తించింది. ఢిల్లీ నుంచి కొరియర్ల ద్వారా మాదకద్రవ్యాలను పంపిణీ చేస్తూ, వాటిని షూస్, దుస్తులు, కాస్మెటిక్స్, సాండల్స్లో దాచిపెట్టి పంపుతున్నట్లు విచారణలో బయటపడింది. ఈ గ్యాంగ్ శ్రి మారుతి కొరియర్స్, డీటీడీసీ, ప్రొఫెషనల్ కొరియర్స్, షిప్ రాకెట్, ఇండియా పోస్ట్, ఢిల్లీ వెరి, బ్లూ డార్ట్, ట్రాక్ ఆన్ వంటి కొరియర్ నెట్వర్క్లను వినియోగించినట్లు తెలిసింది. కొత్త సంవత్సరం వేడుకలు దగ్గరపడుతున్న నేపథ్యంలో ఈగిల్ టీమ్ భారీ స్థాయిలో డ్రగ్ కంట్రోల్ ఆపరేషన్ ప్రారంభించింది. ఈ సందర్భంగా అంతర్జాతీయ మాదకద్రవ్య ఆపరేషన్ను అడ్డుకుంది. ఢిల్లీలో అరెస్టయిన 50 మందిని హైదరాబాద్కు తరలించే చర్యలు ఇప్పటికే చేపట్టారు. వారిని కోర్టులో హాజరుపరచి మరింత విచారణ జరపనున్నారు. ఈ విచారణలో కీలక అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. వారి ఇచ్చిన ఆధారాలతో మరిన్ని అరెస్టులు జరగనున్నట్లు సమాచారం.
