
DNews: Nov 28: హైదరాబాద్లో జరిగిన రాష్ట్ర స్థాయి సమావేశంలో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన డ్రాఫ్ట్ సీడ్స్ బిల్లుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో శుక్రవారం జరిగిన ఈ సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. కేంద్ర సీడ్స్ బిల్లు రాష్ట్ర ప్రభుత్వ అధికారాలను హరించే ప్రయత్నమని ఆయన విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వాలకే విత్తన ధృవీకరణ అధికారాలు ఉండాలని సూచిస్తూ, రాష్ట్రానికి అధికారం లేకపోతే నకిలీ విత్తనాలను ఎలా నియంత్రిస్తారు అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వ తరఫున అభ్యంతరాలు, సవరణలు పంపాలని అధికారులను ఆదేశించారు. జిల్లావారీగా రైతుల సమావేశాలు నిర్వహించి వారి అభిప్రాయాలను సేకరించాలని సూచించారు. పంట నష్ట పరిహారం విషయంలో డ్రాఫ్ట్ సీడ్స్ బిల్లులో స్పష్టత లేదని వ్యాఖ్యానించారు. ఈ బిల్లుపై తెలంగాణ ప్రభుత్వం బలంగా అభ్యంతరాలు వ్యక్తం చేసి సవరణలు కోరుతుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హెచ్చరించారు.
