
DNews: Nov 28: దండకారణ్య ప్రత్యేక జోనల్ కమిటీ (DKSZC) తాజాగా విడుదల చేసిన లేఖలో మావోయిస్టు సెంట్రల్ కమిటీ పొలిట్బ్యూరో సభ్యుడు దేవ్ జీ పోలీసుల అదుపులో ఉన్నారని ఆరోపించింది. దేవ్ జీని వెంటనే కోర్టులో హాజరుపరచాలని వారు డిమాండ్ చేశారు. నవంబర్ 18న ఆంధ్రప్రదేశ్లో జరిగిన హిడ్మా ఎన్కౌంటర్ అసలు బూటకమని, హిడ్మాను ముందే పట్టుకుని ప్రణాళిక ప్రకారం ఎన్కౌంటర్ చేసినట్లు కమిటీ ఆరోపించింది. అదే సమయంలో, దేవ్ జీతో పాటు మరో యాభై మంది మావోయిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని లేఖలో పేర్కొన్నారు. ఈ సంఘటనలపై నిరసనగా నవంబర్ 30న చత్తీస్గఢ్ దండకారణ్య బంద్ పాటించాలని మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది.
ఇకపోతే, హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత దేవ్ జీ కనిపించకపోవడంతో ఆయన ఎక్కడ ఉన్నారన్న ప్రశ్న ఇంకా అనుమానాస్పదంగానే ఉంది. మావోయిస్టులు ఆయన పోలీసుల అదుపులో ఉన్నారని చెబుతుండగా, తెలంగాణ పోలీసు విభాగం మరియు ఆంధ్రప్రదేశ్ పోలీసులు మాత్రం దేవ్ జీ తమ అదుపులో లేరని స్పష్టం చేశారు. దేవ్ జీ బంధువులు ఆయన అదృశ్యం పై హేబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేయగా, విచారణలో పోలీసులు కోర్టుకు ఆయన తమ అదుపులో లేరని తెలిపారు. దీంతో దేవ్ జీ నిజంగా ఎక్కడ ఉన్నారన్నది ఇంకా స్పష్టత రాలేదు.
